తిరుమల కొండపై దుష్ప్రచారం: ఏకంగా రూ.100 కోట్లు: చంద్రబాబు కూడా కాపాడలేరు: బీజేపీ ఎంపీ
తిరుపతి: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి.. అనుకున్నట్లే పరువు నష్టం దావా వేశారు. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలపై దుష్ప్రచారం సాగించిన ఒకట్రెండు తెలుగు మీడియా సంస్థలపై ఆయన పరువు నష్టం దావా చేశారు. దీనికోసం ఆయన స్వయంగా తిరుపతికి వచ్చారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారం యథేచ్ఛగా సాగుతోందని, ఏడుకొండలపై చర్చి, శిలువ నిర్మాణం సాగుతోందంటూ మీడియాలో వచ్చిన కథనాల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాటిని ప్రసారం చేసిన, ప్రచురించిన ప్రముఖ తెలుగు మీడియా హౌస్పై ఏకంగా వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. అనంతరం ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై కొంతమంది ఉద్దేశపూరకంగా అసత్య ప్రచారాన్ని సాగిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయని, దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తిరుమల ప్రతిష్ఠకు భంగం కలించేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఆ మీడియా సంస్థపై 100 కోట్ల రూపాయల మేర పరువు నష్టం దావా వేసినట్లు స్పష్టం చేశారు. శ్రీవారి ఆలయంపై రాజకీయ కారణాలతో తప్పుడు ప్రచారం చేయడం, సరి కాదని అన్నారు. తాను వేసిన పరువునష్టం దావా నుంచి చంద్రబాబు కూడా కాపాడలేరని వ్యాఖ్యానించారు. తన జీవితంలో ఎప్పుడూ పరువు నష్టం దావా కేసు ఓడిపోలేదని పేర్కొన్నారు.
చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే ఆ మీడియా సంస్థ.. ఏపీ ప్రభుత్వానికి చెడ్డ పేరును తీసుకుని రావడానికి తిరుమల కొండను వాడుకోవడం, అన్యమత ప్రచారం సాగుతోందని కళంకాన్ని అపాదించడం ఏ మాత్రం సహించలేని విషయమని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. అలాంటి తప్పుడు కథనాలు, దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే తానే స్వయంగా పరువునష్టం దావా వేశానని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రజల మద్దతు లేదనే విషయం ఎన్నికలతో స్పష్టమైందని, అందుకే కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.