చంద్రబాబు మళ్లీ రెండుకళ్ల సిద్ధాంతం?: హిందుత్వవాదం..క్రైస్తవ నినాదం: తిరుపతి ఉప ఎన్నికపై
తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..మరోసారి రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది. ఇదివరకు రాష్ట్ర విభజన సమయంలో ఆయన రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెర మీదికి తీసుకొచ్చారు. ఏపీలో సమైక్యాంధ్ర వాదం.. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర నినాదంతో రాజకీయాలను కొనసాగించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి మాటెలా ఉన్నప్పటికీ.. ఏపీలో మాత్రం ఒక విడత అధికారంలోకి రాగలిగింది. అదే రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఆయన ఈ సారి మత రాజకీయాలపై ప్రయోగించబోతోన్నట్లు కనిపిస్తోంది.
Recommended Video
తిరుపతి ఉప ఎన్నికపై పక్కా వ్యూహం..
ప్రస్తుతం తిరుపతిలో లోక్సభ ఉప ఎన్నిక కోలాహలం నెలకొంది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత.. అన్ని రాజకీయ పార్టీలు ఎదుర్కొనబోతోనన మొట్టమొదటి ఎన్నిక ఇది. ఈ 20 నెలల కాలంలో తమ పార్టీ పరిస్థితి ఎలా ఉందో పరీక్షించుకోవడానికి క్షేత్రస్థాయిలో లభించిన ఒక అవకాశంగా భావిస్తున్నాయి.. ఆయా పార్టీలన్నీ. ఫలితంగా- అన్ని పార్టీల దృష్టీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక మీదే నిలిచింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న తిరుపతి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. దానికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటున్నాయి.
ధర్మ పరిరక్షణ యాత్ర..
తెలుగుదేశం పార్టీ కొత్తగా ధర్మ పరిరక్షణ యాత్రను నిర్వహించబోతోంది. తిరుపతి లోక్సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రామాన్ని చేపట్టడానికి సన్నాహాలు పూర్తిచేసింది. మొత్తం 700 గ్రామాల్లో పర్యటించేలా రూట్ మ్యాప్ను రెడీ చేసింది. ఇంకాస్సేపట్లో ఈ యాత్రను ప్రారంభించబోతోంది. హిందూ ఓటుబ్యాంకును ఆకట్టుకోవాలనే ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ధర్మ పరిరక్షణ యాత్రను నిర్వహించబోతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 10 రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టేనని అంటున్నారు.
బీజేపీ సైతం ఇదే వాదాన్ని అందుకున్న నేపథ్యంలో..
ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో.. హిందుత్వ వాదానికి బ్రాండ్ అంబాసిడర్గా ముద్రపడిన భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టేలా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసేలా ఈ యాత్రను నిర్వహించతలపెట్టినట్లు చెబుతున్నారు. బీజేపీ సైతం దాదాపుగా ఇదే బాటను అనుసరించబోతోంది. వచ్చేనెల 4వ తేదీ నుంచి రథయాత్రను చేపట్టడానికి సన్నాహాలను చేస్తోంది. తిరుపతిలోని కపిలతీర్థం నుంచి విజయనగరం జిల్లాలోని రామతీర్థం వరకూ ఈ యాత్రను నిర్వహించేలా ప్రణాళికను రూపొందించుకుంది.
తిరుమలలో అన్యమత ప్రచారం..టీటీడీలో
టీడీపీ హయాంలో తిరుమల పవిత్రతను తామే కాపాడామని, అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ దాన్ని మంటగలిపిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఇదివరకే చంద్రబాబు చిత్తూరు జిల్లా పార్టీ నాయకులకు సందేశాన్ని ఇచ్చారని అంటున్నారు. టీటీడీ బోర్డులో తాము అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యాన్ని కల్పించామని, దాన్ని వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందంటూ చంద్రబాబు విమర్శించారు. పవిత్ర తిరుమల క్షేత్రంపై వైసీపీ అనుసరిస్తోన్న విధానాలను ధర్మ పరిరక్షణ యాత్ర ద్వారా ఎండగట్టాలంటూ ఆయన దిశానిర్దేశం చేశారు.