తిరుపతి ఉపఎన్నిక ఫలితాల్లో వైసీపీ హవా.. కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నా, తమాషా చూస్తున్నా: పనబాక లక్ష్మి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో, అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక ఫలితాలలో అధికార వైసీపీ హవా కొనసాగుతుంది.తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి తన ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు వైసిపి అభ్యర్థి గురుమూర్తి 90వేల పైచిలుకు ఓట్లతో తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క రౌండ్ లో కూడా టీడీపీ ,బీజేపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబరచలేకపోయారు.
Tirupati Nagarjunasagar by-poll results: తిరుపతి పోస్టల్ బ్యాలెట్స్ లో వైసీపీ ఆధిక్యం!!
ప్రస్తుతం కౌంటింగ్ లో రెండవ స్థానంలో టిడిపి ఆ తర్వాత స్థానంలో బిజెపి ఉన్నట్లుగా తెలుస్తుంది.అయితే ఈ ఫలితాలను చూసి అసంతృప్తితో కౌంటింగ్ కేంద్రం నుంచి టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి వెళ్లిపోయినట్లు గా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని పనబాక లక్ష్మి ఖండించారు. అటువంటి సంఘటన జరగలేదని ఆమె పేర్కొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఫలితాలు కూడా అందుకు తగ్గట్టు ఉండేవని తెలిపారు.
ప్రజాస్వామ్యబద్ధంగా జరగని ఎన్నికల్లో ఫలితాలు ఇదే విధంగా ఉంటాయని పనబాక లక్ష్మి అభిప్రాయపడ్డారు. ఫలితాల గురించి ముందే తెలిసినప్పటికీ అక్కడ జరుగుతున్న తమాషా చూద్దామని కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చానని పనబాక లక్ష్మి చురకలంటించారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గెలుపు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇస్తున్న గెలుపు కాదని పనబాక లక్ష్మి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. మరోవైపు బంపర్ మెజార్టీ దిశగా వైసీపీ అభ్యర్థి దూసుకు వెళ్తున్న క్రమంలో వైసీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.