టీటీడీలో 1572 మందికి కరోనా.. ఐదుగురు మృతి: చిత్తూరు జిల్లాలోనూ అధిక కేసులు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 5.57 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదువేలకు చేరువలో మరణాలున్నాయి. పలు జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ జాబితాలో చిత్తూరు జిల్లా కూడా ఉంది.
ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో కూడా కరోనా కేసులు అత్యధికంగానే నమోదవుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు, ఉద్యోగులు కూడా కరోనా మహమ్మారిని పడ్డారు. లాక్డౌన్ అనంతరం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుండటంతో ఇక్కడ కరోనా కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో పనిచేస్తున్న 1572 మంది ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారినపడ్డారు. వీరిలో 1403 మంది కోలుకున్నారు. మరో 169 మంది చికిత్స పొందుతున్నారని టీటీడీ తెలిపింది. ఇప్పటి వరకు కరోనాతో ఐదుగురు మరణించారని వెల్లచింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా 9536 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 5,67,123కి చేరింది. 95,072 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా, 10,131 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,67,139కి చేరింది. తాజాగా, 66 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4912కు చేరింది.
ఇక చిత్తూరు విషయానికొస్తే.. తాజాగా 957 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 49,398కి చేరింది. 8477 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా, 1005 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 40,396కు చేరింది. గత 24 గంటల్లో ఐదుగురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 525కు చేరింది.