టీటీడీ ఆస్తుల వేలంపై వెనక్కు తగ్గిన బోర్డు.. ఆ స్వామీజీ వేసిన మంత్రం ఫలించిందా..?
తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఆస్తుల వివాదం గంటగంటకు ఓ మలుపు తీసుకుంటోంది. నిరర్థక ఆస్తుల పేరుతో టీటీడీ భూములను విక్రయించాలని భావించిన బోర్డుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి వస్తున్నాయి. ఇటు వెంకన్న భక్తుల నుంచే కాకుండా అటు విపక్షాలు, ఆధ్యాత్మిక గురువులు సైతం టీటీడీ బోర్డు నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.తాజాగా విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. దీంతో టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి కీలక టీటీడీ ఆస్తుల వేలంకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు.

టీటీడీ ఆస్తుల వేలంపై వైవీ సుబ్బారెడ్డి
గత రెండు రోజులుగా మీడియాలో టీటీడీ ఆస్తులను బోర్డు విక్రయిస్తోందంటూ వస్తున్న వార్తలు చాలా బాధాకరమన్నారు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి. టీటీడీ ఆస్తుల అమ్మకాలపై వివరణ ఇచ్చారు వైవీ సుబ్బారెడ్డి. ప్రతిపక్షాలు అనవసరంగా బురదజల్లే కార్యక్రమం చేస్తున్నాయని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి తిరుమల వెంకన్నపై రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రతిపక్షాల తీరు ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజకీయ వ్యతిరేకతతోనే తమపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. గతంలో తాను క్రైస్తవుడినంటూ తనపై నిందలు వేశారని ఇక అప్పటి నుంచి ప్రతిపక్షాలకు ఏమీ దొరక్క ఈ అంశాన్ని విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాము కేవలం దేవుడి సేవకులం మాత్రమే అని వివరణ ఇచ్చారు.

నాడు సదావర్తి భూముల విషయంలో కోర్టుకెళ్లి అడ్డుకున్నాం
వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా నాడు చంద్రబాబు హయాంలో సదావర్తి భూములను అమ్మాలని అప్పటి బోర్డు నిర్ణయించిన సమయంలో తామే కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశామని వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో గరుడ వారది పేరుతో బ్రిడ్జి నిర్మాణం జరిగిందని దానికి ప్రభుత్వం లేదా మున్సిపాలిటీ నుంచి నిధులు ఇవ్వాల్సి ఉండగా టీటీడీ నుంచి నిధులు విడుదల అయ్యాయని గుర్తు చేశారు వైవీ సుబ్బారెడ్డి. టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదనేదే తమ అభిమతమని చెప్పారు. గతంలో చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన స్వామివారికి చెందిన 50 ఆస్తులను వేలం వేయాలని 2016లో నిర్ణయించడం జరిగిందని దానిపైనే ప్రస్తుత బోర్డు సమీక్ష నిర్వహిస్తోందని చెప్పారు.

వేలం వేస్తామని బోర్డు ఎప్పుడూ చెప్పలేదు
అసలు వేలం వేస్తామని తాము ఎక్కడా ప్రకటించలేదని, అనవసరంగా ప్రతిపక్షాలు తొందరపడుతున్నాయని అన్నారు. ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలను మాత్రమే సేకరిస్తున్నామని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి ఆస్తుల వేలంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కొందరు స్వామివారికి ఒక సెంటు రెండు సెంట్లు భూములు ఇచ్చారని వీటిపై సమీక్ష నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చే బోర్డు మీటింగులో దీనిపై మరోసారి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆస్తుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి.... అదే సమయంలో ధార్మిక పెద్దలతో కూడా సంప్రదించి సలహాలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. మొత్తానికి వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన వివరణతో ప్రతిపక్షాలు శాంతిస్తాయా లేదా అనేది వేచిచూడక తప్పదు.

సూచనలు చేసిన స్వరూపానందేంద్ర స్వామి
ఇక అంతకుముందు తిరుమల తిరుపతి వెంకేటేశ్వర స్వామి ఆలయం ఆస్తులు వివాదం తారాస్థాయికి చేరుతుండటంతో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వివాదంను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేశారు. ప్రభుత్వానికి విలువైన సూచనలు చేసే విశాఖ శారదా పీఠం శ్రీ స్వరూపానందేంద్ర స్వామి టీటీడీ భూముల విక్రయం పై ఏపీ ప్రభుత్వ పెద్దలతో పాటు టీటీడీ చైర్మన్ టీటీడీ ఈవోలతో కీలక మంతనాలు చేపట్టినట్లు తెలుస్తోంది. టీటీడీ వ్యవహారంలో వివాదాలకు తావు ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి శ్రీస్వరూపానంద స్వామి సూచనలు చేశారని సమాచారం.

వివాదాలను పరిష్కరించాలని సూచించిన స్వామీజీ
టీటీడీకి సంబంధించిన ఏ విషయమైన సరే భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుందన్న విషయాన్ని గ్రహించి వారి మనోభావాలను గౌరవించే విధంగా టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకోవడం మంచిదని స్వరూపానంద స్వామి టీటీడీ పాలక మండలి కి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. టీటీడీ భూముల విక్రయం విషయంలో వివాదాలకు తెరదించే విధంగా నిర్ణయం తీసుకోవడమే మేలని అభిప్రాయపడిన శ్రీ. స్వరూపానందేంద్ర స్వామి... మూడు నెలల తర్వాత శ్రీవారి ఆలయం తెరుచుకుంటుందని అంతా భావిస్తున్న నేపథ్యంలో వివాదాలకు తావివవ్వడం సరికాదన్నారు. ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని శ్రీ స్వరూపానంద స్వామి సూచించారు. అయితే స్వరూపానంద స్వామి చేసిన సూచనల తర్వాత ఆలయం ఆస్తులపై టీటీడీ ఛైర్మెన్ వివరణ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications