శ్రీవారి భక్తులకు లడ్డూతో పాటు మరో ప్రసాదం - దివ్య దర్శనం టోకెన్లు సిద్దం..!!
Tirumala: శ్రీవారి భక్తులకు లడ్డు ప్రసాదంతో పాటు మరో ప్రసాదం అందించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల ఆలయాల్లో సేవలకు ఉపయోగించిన పువ్వులను పరమ పవిత్రంగా భావిస్తారు. ఆ పువ్వులతో పరిమళభరితమైన అగరబత్తులను తయారుచేసి భక్తులకు అందించేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. ఈ అగరబత్తులకు భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తోంది. దీంతో, ఉత్పత్తి సామర్ధ్యం రెండు రెట్లు పెంచాలని నిర్ణయించింది. తిరుమలకు కాలి నడకన వచ్చే భక్తులకు ఈ రోజు నుంచి దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు.
శ్రీవారి లడ్డు ప్రసాదంతో పాటు..
టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో తయారు చేసిన పరిమళభరితమైన రూ.30.66 కోట్ల విలువైన అగరబత్తులను ఇప్పటి వరకు భక్తులకు విక్రయించారు. బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ సహకారంతో 2021 సెప్టెంబరు 13వ తేదీన టీటీడీ ఈ అగరబత్తులను తయారుచేసి భక్తులకు అందుబాటులోనికి తీసుకువచ్చింది.
భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ తో ప్రస్తుతం ఉన్న ప్లాంట్ వద్దే రూ 2కోట్లతో రెండవ యూనిట్ ను ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు 15 వేల అగరబత్తుల ప్యాకెట్లు తయారవుతున్నాయి. రెండవ యూనిట్ ప్రారంభించడం వల్ల ఈ సంఖ్య రోజుకు 30 వేల ప్యాకెట్లకు పెరుతుంది. దీనివల్ల సుమారు 200 మంది స్థానిక మహిళలకు ఉపాధి లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇక నుంచి భక్తులు శ్రీవారి లడ్డు ప్రసాదంతో పాటు అగరబత్తులను కూడా ప్రసాదంగా అందించడానికి ముందుకొస్తున్నారు.

ఎస్వీ గోశాలలోనే ఉత్పత్తి
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీకి రోజువారీ అవసరమయ్యే 4వేల లీటర్ల పాలను ఎస్వీ గోశాలలోనే ఉత్పత్తి చేసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే స్వఛ్చమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, సొంతంగా తయారు చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. గోవులకు బలవర్ధకమైన సమగ్రదాణా అందించడం ద్వారా పాల ఉత్పత్తి ఇప్పటికంటే 10 నుంచి 15 శాతం పెరుగుతుంది.
ఇక్కడ తయారుచేసే సమగ్ర దాణాను గోవులకు అందించడం వల్ల పాల ఉత్పత్తి పెరగడంతో పాటు గోవులు ఇచ్చే పాలలో ప్రొటీన్ శాతం మరింత అధికంగా లభిస్తుంది. దేశవాళీ గోజాతులను అభివృద్ధి చేయడం కోసం దాతల సహకారంతో 500 దేశవాళీ గోవులను సమీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాజస్థాన్ నుంచి ఇప్పటి వరకు 120కి పైగా గిర్, కాంక్రీజ్ దేశవాళీ జాతుల గోవులను తీసుకొచ్చారు.
నేటి నుంచి దివ్య దర్శనం టోకెన్లు
తిరుమలకు కాలి నడకన మార్గంలో వచ్చే భక్తులకు నేటి నుంచి అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ప్రయోగాత్మకంగా దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. అలిపిరి మార్గంలో రోజు కు 10వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకు 5 వేల టోకెన్లు ఇస్తారు. సర్వదర్శనం టోకెన్లు, రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, సేవా టికెట్లు పొందిన భక్తులకు నడక దారిలో దర్శన టోకెన్లు జారీ చేయరు.
అటువంటి వారిని గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వారం రోజుల పాటు ఈ విధానం పరిశీలించి అవసరమైన మార్పులతో నిర్ణయాలు తీసుకోనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు.












Click it and Unblock the Notifications