మరో వివాదంలో టీటీడీ- అధిక వడ్డీ కోసం ప్రభుత్వ బాండ్లలో నిధులు- అర్హత లేదన్న ఐవైఆర్
గతేడాది వైసీపీ ప్రభుత్వం వచ్చాక తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న టీటీడీ ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయంతో ఇరుకునపడింది. భక్తులు సమర్పించే కానుకలతో పాటు టీటీడీకి వచ్చే నిధులను అధిక వడ్డీ కోసం రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కలకలం రేపుతోంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ బాండ్లలో కానీ, జాతీయ బ్యాంకుల్లో కానీ ఈ నిధులను పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండగా.. తాజాగా నిబంధనలను సవరించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టేలా నిర్ణయం తీసుకున్నారు. తద్వారా నిధుల లేమితో కుదేలవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ సహకారం అందినట్లవుతోంది. దీంతో ప్రభుత్వం కోసమే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టీటీడీ నిర్ణయం వివాదాస్పదం...
తిరుమల, తిరుపతి దేవస్ధానానికి భక్తులు వివిధ రూపాల్లో కానుకలు సమర్పిస్తుంటారు. ఇవి కాక పలు రూపాల్లో నిధులు సమకూరుతుంటాయి. వీటిని వివిధ జాతీయ బ్యాంకుల్లో పెట్టుబడులుగా పెట్టడం ద్వారా వచ్చే డబ్బును టీటీడీ ధర్మకార్యాలకు వినియోగిస్తుంటుంది. అయితే ప్రస్తుతం జాతీయ బ్యాంకుల్లో పెట్టే పెట్టుబడులకు ఇచ్చే వడ్డీ రేట్లు బాగా తగ్గిపోయాయి. కేవలం 4 నుంచి 5 శాతం మాత్రమే వడ్డీ వస్తోంది. దీంతో మెరుగైన పెట్టుబడి అవకాశాల కోసం వెతుకుతున్న టీటీడీకి ఏపీ ప్రభుత్వం కనిపించింది. జాతీయ బ్యాంకులు ఇచ్చే దాని కంటే ఎక్కువ మొత్తం వడ్డీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో టీటీడీ ఈ మేరకు తాజాగా నిబంధనలను సవరించింది. దీని ప్రకారం ఏపీ ప్రభుత్వ సెక్యూరిటీల్లో టీటీడీ నిధులను పెట్టుబడిగా పెడతారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది.
డిసెంబర్లో భారీగా నిధుల రాక...
గతంలో టీటీడీ వివిధ మార్గాల్లో బ్యాంకుల్లో, ఇతర పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లుగా పెట్టిన మొత్తం ఈ ఏడాది డిసెంబర్లో మెచ్యూరిటీ కానుంది. ఈ మొత్తాన్ని తిరిగి ఎక్కడో చోట పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అందుకే ఈ భారీ మొత్తంపై రాష్ట్ర ప్రభుత్వ కన్ను పడినట్లు తెలుస్తోంది. అసలే నిధుల కొరతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం భారీ వడ్డీ ఆశ చూపి టీటీడీ నిధులను ఖజానాకు తరలించాలని నిర్ణయించినట్లు అర్ధమవుతోంది. ఇందుకోసం టీటీడీ బోర్డులో చర్చించారు. అయితే ఫైనాన్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టాలని సూచించింది. అయితే దీన్ని తిరస్కరించి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లోనూ పెట్టుబడులు పెట్టేలా నిబంధనల్లో టీటీడీ మార్పులు చేసింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెట్టేందుకు అవకాశం దక్కింది.
డిపాజిట్లకు ఐదేళ్ల నుంచి 40 ఏళ్ల వ్యవధి
టీటీడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడిగా పెట్టేందుకు ఐదేళ్ల నుంచి 40 ఏళ్ల గడువు ఉండేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ కాల వ్యవధి ముగిశాకే వడ్డీ చెల్లించేలా నిర్ణయించారు. మధ్యలో ఎలాంటి చెల్లింపులు ఉండవు. ఈ ఏడాది డిసెంబర్లో వచ్చే నిదులను ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టాక కనీసం ఐదేళ్ల వరకూ ఎలాంటి డబ్బూ వెనక్కి రాదు. ఆ తర్వాత గరిష్టంగా 40 ఏళ్ల తర్వాత వడ్డీతో పాటు నిధుల చెల్లింపు ఉంటుంది. అయితే అనిశ్చితితో కూడిన రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో టీటీడీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ నిధులు తీసుకుని ప్రభుత్వ పథకాలను నడిపించాలని భావిస్తుండటం కూడా విమర్శలకు తావిచ్చేలా ఉంది.
Recommended Video
టీటీడీ నిర్ణయంపై విమర్శలు..
టీటీడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టాలని తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై స్పందించిన మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు టీటీడీ దీనిపై వివరణ ఇస్తే బావుంటుందన్నారు. టీడీడీకి ఈ నిర్ణయం తీసుకునే అర్హత ఉందా లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఒత్తిడి వల్లే టీటీడీ తమ నిధుల్ని ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెడుతోందని ఆరోపించారు. ఇది అధికార దుర్వినియోగమే అంటూ ఐవైఆర్ కృష్ణారావు తన ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రాలు నిధుల సేకరణ కోసం ఆర్బీఐ బాండ్లు జారీ చేస్తోందని, అలా కాదని టీటీడీ నిధులు తీసుకునేలా విధానం మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చిందో చెప్పాలని ఆయన కోరారు.