శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్
తిరుపతి: కోట్లాదిమంది శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి చెందిన 300 రూపాయల టికెట్లను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించిన కోటా ఇది. టీటీడీ అధికారులు ఆన్లైన్లో దీన్ని విడుదల చేశారు. సెప్టెంబర్కు సంబంధించిన సేవా టికెట్లను కిందటి నెలలోనే విడుదల చేసింది. అవన్నీ ఇదివరకే భర్తీ అయ్యాయి.
ఇప్పుడు తాజాగా అక్టోబర్ నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ అధికారులు భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. టికెట్లను పొందిన వారి జాబితాను కూడా విడుదల చేయనున్నారు. టికెట్ల అలాట్మెంట్ వివరాలను భక్తులకు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా తెలియజేస్తారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు మాత్రం ప్రత్యేక దర్శనం టికెట్ల జారీని నిలిపివేశారు అధికారులు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం అయినప్పటి నుంచి ముగిసేంత వరకూ ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. సర్వదర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనంతో పాటు ఇతర సేవా టికెట్లు కూడా ఉండవు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని, అందుకే ప్రత్యేక దర్శన టికెట్లను నిలిపివేసినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు.
కాగా- శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్ఠమిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను అధికారులు నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలో గోకులాష్ఠమి ఆస్థానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.