వైసీపీ-బీజేపీ దోస్తీకి భూవేలం గండి.. జగన్ బాబాయిపై కాషాయదాడి.. టీటీడీ బోర్డులో ట్విస్ట్..
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు చెందిన భూముల వేలం వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఏపీ, తమిళనాడులో అమ్మాలనుకుంటోన్న 50 ఆస్తులు దేవస్థానానికి ఏమాత్రం ఉపయోగపడనివేనన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వాదనను సాక్ష్యాత్తూ బోర్డులోని వాళ్లే తప్పుపడుతుండటం గమనార్హం. ఆస్తుల బహిరంగ వేలం ద్వారా రూ.100 కోట్ల ఆదాయం సమకూర్చుకోవచ్చన్న ప్రతిపాదనను టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు, బీజేపీ రాజ్యసభ ఎంపీ రాకేశ్ సిన్హా తప్పుపట్టారు. ఈ మేరకు సోమవారం ఆయన ఘాటు లేఖ రాశారు. ఈ పరిణామంతో వైసీపీ-బీజేపీ మధ్య కొనసాగుతోన్న దోస్తీకి గండిపడినట్లయిందని విశ్లేషకులు అంటున్నారు.

హైకమాండ్ ఆదేశాలతోనే..
టీటీడీకి చెందిన నిరర్ధక భూముల్ని అమ్మేస్తామంటూ బోర్డు చైర్మన్, సీఎం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ప్రకటన జారీ చేసిన తొలి రోజు నుంచే ఏపీ బీజేపీ నిరసనలు వ్యక్తం చేస్తున్నది. పేరుకు ప్రతిపక్షంగా ఆ మాత్రం నిరసన సహజమే అనుకునేలోపే.. బీజేపీ తెలంగాణ శాఖ సైతం టీటీడీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతామని తీర్మానం చేయడం అందరినీ ఆశ్చర్యపర్చింది. అయినాసరే, వేలంపై వెనక్కి తగ్గబోమని సుబ్బారెడ్డి స్పష్టం చేయడంతో ఇప్పుడేకంగా బోర్డుకు సంబంధించినవాళ్లే నిరసన గళం వినిపిస్తున్నారు. బీజేపీ హైకమాండ్ ఆదేశాలతోనే ఆ పార్టీ ఎంపీ, బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు రాకేశ్ సిన్హా.. చైర్మన్ కు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

లేఖలో ఏం చెప్పారంటే..
స్వామివారికి భక్తులు విరాళంగా ఇచ్చిన ఆస్తులను విక్రయించడం అంటే భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనని, ఈ నిర్ణయంపై పునరాలోచన చేస్తే బాగుంటుందని రాకేశ్ సిన్హా.. చైర్మన్ సుబ్బారెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు, బీజేపీకి దగ్గరి వ్యక్తిగా పేరుపొందిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం సొంత పార్టీ నిర్ణయాన్ని తప్పుపట్టడం కలకలం రేపుతున్నది. ‘‘భక్తులు.. దేవుడికి భూమిని సమర్పించడం వెనుక కొన్ని సెంటిమెంట్లు వుంటాయి. డబ్బు వేరు.. భూమి వేరు.. అలాంటి భూముల్ని అమ్మకుండా హుందాతనంగా వ్యవహరించాలి''అని వైసీపీ ఎంపీ హితవు పలికారు.

బీజేపీ ఉద్యమ కార్యాచరణ..
ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థగా కొనసాగుతోన్న టీటీడీ విషయంలో స్పష్టమైన స్టాండ్ తోనే ముందుకు వెళ్లాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ భూముల వేలాన్ని అడ్డుకుని తీరాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ విషయంలో హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలమేరకు ఏపీ శాఖ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. నేరుగా పొత్తు పెట్టుకోనప్పటికీ.. పార్లమెంటులో బీజేపీ ప్రతిపాదించిన కీలక బిల్లులకు వైసీపీ మద్దతు తెలుపుతూరావడం, సీఎం జగన్ సైతం ప్రధాని మోదీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో వెంకన్న భూముల వ్యవహారం రెండు పక్షాల మధ్య దోస్తీని ప్రభావితం చేసిందని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
Recommended Video

ధార్మిక పరిషత్ కావాలన్న పవన్..
టీటీడీ భూముల వ్యవహారంలో బీజేపీ అనుసరిస్తున్న స్టాండ్నే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సైతం ఫాలో అవుతున్నారు. 2014లో రద్దయిపోయిన ఏపీ ధార్మిక పరిషత్తును పునరుద్ధరించాలన్న రంగరాజన్(చిలుకూలు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు) డిమాండ్ ను పవన్ సమర్థించారు. పరిషత్తును తిరిగి ఏర్పాటు చేయడంద్వారా టీటీడీ సహా హిందూ ఆలయాలన్నీ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతాయని, అప్పుడు భూముల వేలం అవసరం ఉండదన్న వాదనతో ఆయన ఏకీభవించారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ.. ‘‘టీటీడీపై గళం విప్పిన మీకు ధన్యవాదాలు.. సంస్థను రాజకీయ నాయకులకు, వ్యాపారులకు పునరావాస కేంద్రంగా మార్చేసిన నేపథ్యంలో ఇంతకంటే గొప్ప విషయాలను ఊహించలేం''అని ఐవైఆర్ రాసుకొచ్చారు.












Click it and Unblock the Notifications