భక్తులు అవాస్తవాలను నమ్మొద్దంటూ టీటీడీ: టీడీపీ ఎమ్మెల్సీ బీటెకె రవిపై కేసు నమోదు
తిరుపతి: కాషన్ డిపాజిట్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని, ఈ కారణంగానే ఆలస్యంగా భక్తుల ఖాతాల్లోకి చేరుతోందని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి అవాస్తవాలను భక్తులు నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విజ్ఞప్తి చేసింది. కాషన్ డిపాజిట్ సొమ్మును భక్తుల ఖాతాల్లోకి పంపుతున్నామని తెలియజేసింది.
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిపై టీటీడీ ఫిర్యాదు
ఈ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేసిన ఎమ్మెల్సీ బీటెక్ రవిపై టీటీడీ అధికారులు సోమవారం తిరుమల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కరంట్ బుకింగ్, ఆన్లైన్ బుకింగ్ విధానంలో గదులు బుక్ చేసుకుంటున్నారు. భక్తులు గదులు ఖాళీ చేసిన తరువాతి రోజు మధ్యాహ్నం 3 గంటలలోపు కాషన్ డిపాజిట్ రీఫండ్ ఎలిజిబిలిటి స్టేట్మెంట్ను అధీకృత బ్యాంకులైన ఫెడరల్ బ్యాంకు లేదా హెచ్డిఎఫ్సి బ్యాంకులకు పంపడం జరుగుతుంది.
ఈ బ్యాంకుల అధికారులు అదేరోజు అర్ధరాత్రి 12 గంటలలోపు(బ్యాంకు పనిదినాల్లో) సంబంధిత మర్చంట్ సర్వీసెస్కు పంపుతారు. మర్చంట్ సర్వీసెస్ వారు మరుసటిరోజు కస్టమర్ బ్యాంకు అకౌంట్కు పంపడం జరుగుతుంది.
4-5 రోజుల్లో భక్తుల ఖాతాల్లోకి రీఫండ్: టీటీడీ
కస్టమర్ బ్యాంకు వారు సంబంధిత అమౌంట్ కన్ఫర్మేషన్ మెసేజ్(ఏఆర్ నంబరు)ను, సొమ్మును సంబంధిత భక్తుల అకౌంట్కు పంపుతారు. కస్టమర్ బ్యాంకు వారు భక్తుల అకౌంట్కు సొమ్ము చెల్లించడంలో జాప్యం జరుగుతోందని టీటీడీ గుర్తించడం జరిగింది. ఒకవేళ భక్తులు యాత్రికుల సమాచార కేంద్రాలు, కాల్ సెంటర్, ఈ-మెయిల్ ద్వారా సమస్యను టీటీడీ దృష్టికి తీసుకొచ్చిన పక్షంలో పైవివరాలతో సంబంధిత బ్యాంకుల్లో విచారణ చేయాలని భక్తులకు సూచించడం జరిగింది.
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 7 బ్యాంకు పనిదినాల్లో కాషన్ డిపాజిట్ రీఫండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జులై 11 నుంచి 4, 5 రోజుల్లో రీఫండ్ చేరే విధంగా టీటీడీ యుపిఐ విధానంలో రీఫండ్ చేయడం జరుగుతోంది. దీనివల్ల నేరుగా భక్తుల అకౌంట్కే రీఫండ్ సొమ్ము చెల్లించడం జరుగుతోంది.
టీటీడీపై దుష్ప్రచారం తగదు
ఇదిలా ఉండగా కొందరు వ్యక్తులు పనిగట్టుకుని కాషన్ డిపాజిట్కు సంబంధించి టీటీడీపై దుష్ప్రచారం చేయడం మంచిది కాదు. వాస్తవంగా కాషన్ డిపాజిట్ సొమ్ము నేరుగా భక్తుల ఖాతాలకే చేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ వినియోగించుకుంటున్నాయని ఆరోపించడం శోచనీయం. వాస్తవాలను నిర్ధారించుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ పేర్కొంది.
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిపై కేసు నమోదు
కాగా, ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న బీటెక్ రవి.. వసతి గదుల డిపాజిట్ విధానంపై విమర్శలు చేశారు. గతంలో తాను చెల్లించిన రూ. 3,500లు నెలలు గడిచినా తిరిగి ఇవ్వలేదన్నారు. ఈ డబ్బు ప్రభుత్వం వాడుకుంటోందని గదలు వద్ద ఉండే సిబ్బంది చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయంపై టీటీడీ రిసెప్షన్ ఓఎస్డీ ఫిర్యాదు మేరకు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిపై పోలీసులు కేసు నమోదు చేశారు.