వంతెన.. సీతాకోక చిలుక ఆకృతిలో! శ్రీవారి భక్తులకు ఇక నాన్స్టాప్ ప్రయాణం!
తిరుపతి: కలియుగ వైకుంఠం తిరుమలను సందర్శించడానికి ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేస్తుంటారు భక్తులు. ఏటేటా పెరుగుతోన్న భక్తల రద్దీ ఫలితంగా- తిరుపతిలో వాహనాల రాకపోకలు నిత్యం స్తంభించిపోతుంటాయి. తిరుపతి రైల్వేస్టేషన్, బస్ స్టేషన్, అలిపిరి వంటి చోట్ల వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. దీనికితోడు- ప్రైవేటు వాహనాలు, ఆటోలతో ఆయా ప్రాంతాలన్నీ కిటకిటలాడుతుంటాయి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఓ భారీ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది స్థానిక మున్సిపల్ కార్పొరేషన్.. కాస్త ఆలస్యంగానైనా! యాత్రికుల ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి నడుం బిగించింది. స్మార్ట్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను చేపట్టింది. దీనికి గరుడ వారధి అని నామకరణం చేస్తారు.

సర్కారీ వాటా కూడా టీటీడీ మీదే..
మొత్తం 6.1 కిలోమీటర్ల పొడవున ఈ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించబోతున్నారు. దీనికి అయ్యే ఖర్చు 684 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కేంద్రప్రభుత్వ వాటా 65 శాతం ఉంటుంది. మరో 35 శాతం నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం భరిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం భరించదలిచిన 35 శాతం నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. ఈ 35 శాతం నిధుల్లో 17.5 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ప్రభుత్వ ఖజానా నుంచి ఆ నిధులను విడుదల చేయాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయట్లేదు. 17.5 శాతం వాటాను తిరుమల తిరుపతి దేవస్థానం మీదే రుద్దింది. ఫలితంగా- ప్రభుత్వ వాటాను కూడా టీటీడీనే భరించాల్సి వస్తోంది.

ఎక్కడి నుంచి ఎక్కడికి?
తిరుపతిలో అత్యంత రద్దీ మార్గాల్లో ఒక్కటైన అలిపిరి రోడ్లో దీన్ని నిర్మించనున్నారు. తిరుచానూరు సమీపంలోని మ్యాంగోమార్కెట్ వద్ద ఎలివేటెడ్ కారిడార్ వంతెన ఆరంభమౌతుంది. లక్ష్మీపురం సర్కిల్, రామానుజుల వారి సర్కిల్, శ్రీనివాసం, లీలామహల్ సెంటర్ మీదుగా వెళ్తుంది. నంది సర్కిల్ వద్ద ఈ వంతెన ముగుస్తుంది. అక్కడి నుంచి ఎలాంటి వాహనాల రాకపోకలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా అలిపిరి టోల్గేట్ వరకూ వెళ్లవచ్చు. గరిష్ఠ వేగం 40 కిలోమీటర్లుగా నిర్ణయించే అవకాశం ఉంది. సాధారణంగా ఎలివేటెడ్ కారిడార్ ఎక్స్ప్రెస్ వే వంటి వంతెనలపై గరిష్ఠ వేగం 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది. తిరుపతిలో మాత్రం భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని వేగాన్ని 40 కిలోమీటర్లకే పరిమతం చేయవచ్చని చెబుతున్నారు.

సీతాకోక చిలుక ఆకృతిలో
వంతెన మార్గమధ్యలో ఎంఎస్ సుబ్బులక్ష్మి సర్కిల్ వద్ద ఎలివేటెడ్ కారిడార్ను సీతాకోక చిలుక ఆకృతిలో నిర్మిస్తారు. తిరుచానూరు నుంచి వంతెన మీదుగా తిరుపతి బస్స్టాండ్ లేదా రైల్వేస్టేషన్ వెళ్లడానికి ఇక్కడ ర్యాంప్ ఏర్పాటు చేస్తారు. బస్స్టాండ్ లేదా రైల్వేస్టేషన్ నుంచి రేణిగుంట వైపునకు వెళ్లడానికి కూడా అవసరమైన ర్యాంప్ను ఈ ప్రాంతంలో నిర్మిస్తారు. దీనితో పాటు బస్స్టాండ్, రైల్వేస్టేషన్ల నుంచి వంతెన మీదుగా అలిపిరి చేరుకునే వారికి, రేణిగుంట నుంచి అలిపిరికి వెళ్లాల్సిన వాహనాల కోసం ప్రత్యేక ర్యాంప్లను అందుబాటులోకి తీసుకొస్తారు. దీనితో అక్కడ సీతాకోక రెక్కల తరహా ఆకృతి ఏర్పడుతుంది.

మూడు ప్యాకేజీల్లో పనులు..
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో తొలిదశ సందర్భంగా మ్యాంగో మార్కెట్ నుంచి రామానుజ కూడలి వరకు ఓ ప్యాకేజీ, అక్కడి నుంచి లీలామహల్ సెంటర్ వరకు ఇంకో ప్యాకేజీ, లీలామహల్ సెంటర్ నుంచి నందిసర్కిల్ వరకు మరో ప్యాకేజీగా విభజించారు. బస్టాండు ప్రాంతంలో అండర్పాస్లు, రైల్వేస్టేషన్ నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక లైన్లతో పాటు లీలామహల్ సర్కిల్ వద్ద కడప నుంచి వచ్చే వాహనాల కోసం డబుల్ లైను నిర్మిస్తారు. మొత్తం 4 లైన్ల వారధి, రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రస్తుతం మొదటి దశ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. షాపూర్జీ పల్లోంజీ ఇన్ఫ్రాకు చెందిన ఆఫ్కాన్స్ సంస్థకు ఈ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ నిర్మాణ పనులను అప్పగించారు. పిల్లర్లను వేయడానికి అత్యాధునిక డ్రిల్లింగ్ యంత్రాలను తీసుకుని రానున్నారు.












Click it and Unblock the Notifications