వంద రోజులు కష్టపడండి: వచ్చేది ప్రజా ప్రభుత్వమే: తిరుపతిలో జగన్ సమరశంఖం
Recommended Video
తిరుపతి: ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైెస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలందరూ తన కుటుంబ సభ్యులేనని అన్నారు.
కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా తాను పరిపాలన అందిస్తానని చెప్పారు. పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్తా శక్తివంచన లేకుండా కష్ట పడాలని సూచించారు. చంద్రబాబు పాలనలో అయిదేళ్ల పాటు సామన్య ప్రజలతో పాటు అన్ని వర్గాల వారూ అనేక కష్ట, నష్టాలను ఎదుర్కొన్నారని చెప్పారు. 14 సంవత్సరాల పాటు చంద్రబాబు పరిపాలను చూశామని, ఏనాడూ దివంగతీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలాగా పరిపాలించ లేకపోయారని అన్నారు.
త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నదని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికలు ప్రజల అభిమానం, ధనం మధ్యే జరుగుతుందని చెప్పారు. ప్రజల అభిమానం తనకు ఉందని, వారి కోసం తాను ఎంతటి కష్టాన్నయినా భరిస్తానని అన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే తాను 3678 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రభుత్వం తన ప్రజల చేతుల్లో ఉంటుదని భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.3వేలు పింఛన్ ఇస్తామని చెప్పారు.
వంద రోజుల పాటు కష్టపడితే ప్రజల ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బహిరంగ సభ ప్రారంభానికి ముందు జగన్- జిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. క్షేత్రస్థాయి నివేదికలను తెప్పించుకున్నారు. బూత్, గ్రామ, మండల స్థాయి వివరాలను తెలుసుకున్నారు. అధికార పార్టీ డబ్బుతో ఓట్లను కొనుగోలు చేస్తుందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సీఎం సొంత జిల్లాలో అత్యధిక సీట్లను గెలుచుకోవాలని పార్టీ శ్రేణులకు జగన్ దిశా నిర్దేశం చేశారు.