తెలుగుదేశంలో సంక్షోభం: టీడీపీ తమదేనంటూ 17 మంది సభ్యులు స్పీకర్కు లేఖ: కారెం శివాజీ జోస్యం..!
తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న తెలుగుదేశం పార్టీ త్వరలోనే పెను సంక్షోభంలో కూరుకునిపోవడం ఖాయమని అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన 17 మంది శాసనసభ్యులు త్వరలోనే తిరుగుబాటు చేయబోతున్నారని చెప్పారు. అసలైన తెలుగుదేశం పార్టీ తమదేనని, పార్టీ ఎన్నికల సింబల్ సైకిల్ గుర్తును కూడా తమకే కేటాయించాలని కోరుతూ వారంతా స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాయనున్నారని అన్నారు.

టీడీపీలో 1995 నాటి పరిస్థితులు..
గురువారం ఉదయం ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారు జామున వీఐపీ బ్రేక్ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం నుంచి వెలుపలికి వచ్చిన తరువాత కారెం శివాజీ.. విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయని వెల్లడించారు. 1995 నాటి పరిస్థితులు తెలుగుదేశంలో ఏర్పడబోతున్నామని చెప్పారు.

29 గ్రామాలకే పరిమితమైందంటూ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ, జాతీయ రాజకీయాల్లో గానీ ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠ ప్రస్తుతం మసకబారిందని చెప్పారు. కేవలం 29 గ్రామాలకే పరిమితమైందని విమర్శించారు. మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకోవడం ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకతను తెలుగుదేశం పార్టీ మూటగట్టుకుందని ఆరోపించారు. ఇలాంటి పరిణామాలను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు.

రియల్ ఎస్టేట్ రాజకీయాల చుట్టూ..
అమరావతి ప్రాంత రైతుల సంక్షేమం కోసమే తాను ఉద్యమిస్తున్నానని చంద్రబాబు గానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు గానీ చెప్పుకోవడంలో అర్థం లేదని కారెం శివాజీ అన్నారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకులు కొనుగోలు చేసిన భూముల కోసమే ఆయన పరితపిస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాజకీయాలన్నీ రియల్ ఎస్టేట్ చుట్టూ తిరుగుతున్నాయని 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు బలంగా విశ్వసిస్తున్నారని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాజకీయంగా తాము మనుగడ సాగించలేమని వారు భావిస్తున్నారని చెప్పారు.

మూడు రాజధానులను స్వాగతిస్తున్నా..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని కారెం శివాజీ అన్నారు. ఇదివరకు కూడా తాను ఇదే విషయాన్ని స్పష్టం చేశానని గుర్తు చేశారు. గతంలో అమరావతి రైతుల ఆందోళనలపై కారెం శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల వల్ల మూడు ప్రాంతాలూ సమగ్రంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. అమరావతి ప్రాంత రైతులు త్యాగాలు చేశారని చంద్రబాబు పదేపదే చెబుతున్నారని, ఎకరా భూమికి 1200 గజాల స్థలాన్ని అభివృద్ధి చేసి వారికి తిరిగి ఇవ్వడాన్ని త్యాగం చేసినట్లుగా భావించకూడదని అన్నారు.












Click it and Unblock the Notifications