తుఫాన్లో.. మోకాలి లోతు వరద నీటిలో - వైసీపీ ఎమ్మెల్యే భూమన
తిరుపతి: బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను మాండోస్ తీరం దాటిన తరువాత కూడా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు ఇంకా కురుస్తోన్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. ఏపీ సహా తమిళనాడు, కర్ణాటకల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 24 గంటల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తీరం దాటిన తరువాతా..
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండోస్ తుఫాన్.. అర్ధరాత్రి మహాబలిపురం వద్ద తీరం దాటిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇది బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పుడు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. పలు చోట్ల మధ్యాహ్నం వరకూ ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంద

తీరం గజగజ
అత్యధికంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో 125.75 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా నాయుడిపేటలో 114 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. తుఫాన్ తీరం దాటే సమయంలో 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్య కారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దంటూ అధికారులు ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు.

తమిళనాడు, కర్ణాటకల్లో..
తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, రామనాథపురం, నాగర్ కోయిల్, నాగపట్టణం.. తుఫాన్ ప్రభావానికి గురయ్యాయి. చెన్నైలో తుఫాన్ బీభత్సాన్ని సృష్టించింది. భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. ముందు జాగ్రత్తచర్యగా పలు విమానాలను అధికారులు రద్దు చేశారు. ఆయా జిల్లాల్లో పాఠశాలలు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మరో 24 గంటల పాటు తుఫాన్ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. కర్ణాటకలో బెంగళూరు సహా పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి.

వణికిన తిరుపతి..
కాగా- భారీ వర్షాల దెబ్బకు తిరుపతి వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మోకాలి లోతు నీళ్లు నిలిచాయి. విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. గత ఏడాది కూడా ఇదే డిసెంబర్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాల ప్రభావంతో తిరుపతిలో అతి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో కూడా మళ్లీ అదే పరిస్థితి అక్కడ తలెత్తింది. ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాలకు చలి తోడు కావడంతో- ఇళ్లల్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది.

భూమన పర్యటన..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ఈ మధ్యాహ్నం తిరుపతిలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. ఆయన వెంట తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి పర్యటించారు. పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక అధికారులు ఉన్నారు. మోకాలి లోతు నీళ్లల్లో ఆయన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

అధికారులకు ఆదేశాలు..
రామానుజం సర్కిల్, జైభీం నగర్ కాలనీ, లక్ష్మీపురం సర్కిల్ సహా 12వ డివిజన్ పరిధిలో వరద ముంపువాసులను పరామర్శించారు. అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంత వాసులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని సూచించారు. సహాయ, పునరావాస శిబిరాలను సందర్శించారు.












Click it and Unblock the Notifications