తిరుపతి లడ్డూ ధర పెంపుపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ
తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ ధరలను పెంచుతున్నట్లు వచ్చిన వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టతనిచ్చారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరలను పెంచడం లేదని ఆయన తెలిపారు.
లడ్డూ ధరలను పెంచకూడదని నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలేవీ టీటీడీ తీసుకోదని ఆయన చెప్పారు. అతిథి గృహాల అద్దె పెంపుపైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
త్వరలో శ్రీవారి లడ్డూ ప్రసాదం పంపిణీ, విక్రయాల్లో రాయితీలకు టీటీడీ మంగళం పాడనుందని, లడ్డూ ధర రెట్టింపు కానుందని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ ఇచ్చి.. ఆపై రూ. 50కి ఒక లడ్డూ విక్రయించేలా టీటీడీ ప్రణాళిక సిద్ధం చేసిందని వార్తలు వినిపించాయి. దీంతో శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేమీ వ్యాపారం కాదని, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డి ప్రకటన భక్తులకు ఊరట కలిగించింది.
కాగా, చెన్నైలో శ్రీవారి ఆలయానికి తమిళనాడు ప్రభుత్వం స్థలం కేటాయించిందని తెలిపారు. ఆగమశాస్త్రాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణానికి అనుకూలమా? లేదా? అనే విషయం త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. చెన్నై స్థానిక సలహా మండలి కమిటీ టీటీడీలో బాధ్యతలు స్వీకరించడంతో దీనికి ముఖ్య అతిథిగా వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
శ్రీవారి సన్నిధిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ సేవలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించారు. అంతకుముందు ఆయనకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఈవో, అదనపు ఈవో స్వామివారి తీర్థప్రసాదాలను సీజేఐకి అందజేశారు.