Rahul murder case:తలపై పదే పదే దాడి, చిట్లిన మెదడు నరాలు.. ఆపై ఉరేసి
బెజవాడ బిజినెస్ మేన్ రాహుల్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. నగదు లావాదేవీలు అని, కంపెనీ కొనుగోలు అని రకరకాల అంశాలు తెరపైకి వస్తోన్నాయి. అయితే రాహుల్ మరణానికి గల మరో కారణం తెలిసింది. అతనిని ఎలా చంపారనే విషయంపై క్లారిటీ వచ్చింది. కారులోనే హత్య చేసిన.. ఎలా హత్య చేశారనే అంశంపై స్పష్టత వచ్చింది.

సంచలన విషయాలు
రాహుల్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సూత్రధారి కోగంటి సత్యం, పాత్రధారి కోరాడ విజయ కుమార్ అని పోలీసులు తేల్చారు. దారుణంగా రాహుల్ను హత్య చేశారని దర్యాప్తులో తేలింది. హత్యకు ముందు రాహుల్ను అత్యంత దారుణంగా కొట్టారని.. తలపై అనేకసార్లు కొట్టడంతో అతని మెదడు నరాలు కూడా చిట్లినట్టు గుర్తించారు. కారులోనే తాడుతో ఉరేసి చంపి... ఆ స్థానంలో మరొక తాడుని ఉంచినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. పోలీసులకు సాక్ష్యాధారాలు దొరక్కుండా నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించినట్టు తెలుస్తోంది. రాహుల్ ఒక ఫోన్ మాయం చేయడం.. బినామీ పేర్లతో కొత్త ఫోన్లు, కొత్త సిమ్ కార్డులు తీసుకొని వినియోగించినట్టు ఇందులో భాగమనేనని పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు రెండు చోట్ల సెటిల్ మెంట్కి ప్రయత్నించారు. అక్కడ మాట వినకపోవడంతో రాహుల్ని తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది. రాహుల్ హత్యలో మొత్తం 12 మంది పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు..

30 శాతం వాటా..
ఫ్యాక్టరీని కోగంటి సత్యానికి అమ్మేసి తన 30 శాతం వాటా డబ్బులు ఇవ్వాలని కోరాడ విజయ్ ఒత్తిడి తీసుకొచ్చాడని పోలీసులు గుర్తించారు. కోగంటి సమక్షంలో బలవంతంగా కంపెనీ షేర్లు మార్పిస్తూ పేపర్లపై సంతకాలు పెట్టించి.. అక్కడే రాహుల్ని మరోసారి దారుణంగా కొట్టినట్టు తెలుస్తోంది. రాహుల్ని చంపేయాలని కోగంటి, కోరాడ తమ అనుచరులకు ఆదేశించారని.. వారి ఆదేశాలతో కారులోనే హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక విషయాలు పొందుపర్చారు. వాటా అమ్మే విషయంలో రాహుల్, విజయ్కుమార్ మధ్య తలెత్తిన వివాదాన్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు కోగంటి సత్యం ప్రయత్నించినట్టు పేర్కొన్నారు. చౌకగా కంపెనీని కొట్టేయాలని కోగంటి ప్రణాళిక రచించినట్టు తేల్చారు. నామమాత్రపు ధరకు కంపెనీని అమ్మేందుకు రాహుల్ అంగీకరించనందునే.. హత్యకు కుట్రపన్నినట్టు పోలీసులు నిర్ధారించారు.

40 శాతం వాటా రాహుల్దీ..
జిక్సిన్ కంపెనీలో రాహుల్కు 40 శాతం వాటా ఉండగా.. విజయ్కుమార్కు 30 శాతం వాటా ఉన్నాయి. బొబ్బా స్వామి కిరణ్, రాహుల్ చౌదరికి కలిపి మరో 30 శాతం వాటా ఉన్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో కోరాడ విజయ్కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు ఖర్చు చేసిన విజయ్కుమార్ను.. అప్పులు ఇచ్చిన వారు వేధించడం మొదలు పెట్టారు. దీంతో జిక్సిన్ కంపెనీలో తాను పెట్టిన 30 శాతం పెట్టుబడులు తిరిగి ఇచ్చేయాలని రాహుల్ను విజయ్కుమార్ కోరినట్టు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు తెలిపారు. అందుకు రాహుల్ అంగీకరించకపోవడంతో... విజయ్కుమార్.. కోగంటి సత్యాన్ని కలిశాడు. ఇదే అదనుగా భావించిన కోగంటి సత్యం.. కంపెనీని చౌకగా కొట్టేసేందుకు ప్లాన్ చేశాడు. తక్కువ ధరకు కంపెనీలో 90 శాతం వాటాను తనకు ఇవ్వాలని రాహుల్ను కోరాడు ఇందుకు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కలిసి హత్యకు ప్లాన్ చేసినట్టు విచారణలో పోలీసులు తేల్చారు.

రూ.6 కోట్లు వసూల్
మెడికల్ సీటు ఇప్పిస్తానని గాయత్రి వద్ద రాహుల్ రూ.6 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. మెడికల్ సీటు ఇప్పించకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని గాయత్రి.. రాహుల్పై ఒత్తిడి తెచ్చింది. రాహుల్ తండ్రి రాఘవరావు తొలుత రూ.50 లక్షలు ఇస్తామని గాయత్రికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల 18వ తేదీన రాత్రి 7.30 నిమిషాలకు గాయత్రి.. రాహుల్కు ఫోన్ చేయగా.. ఒక్కడే కారులో బయటకు వెళ్లాడు. ఆమె మాట్లాడిన తర్వాత రాహుల్ కారులో కోరాడ విజయ్, సీతయ్య, బాబూరావు ఎక్కారు. డబ్బులు తెచ్చావా..? అని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. కారులో ఉన్న సీతయ్య అనే వ్యక్తి రాహుల్ మెడకు వైరు బిగించగా.. బాబూరావు దిండుతో మొహాన్ని అదిపట్టుకున్నాడు. దీంతో అక్కడికక్కడే రాహుల్ మృతి చెందాడు. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

శవం..
గుణదల వద్ద కారులో గుర్తుతెలియని శవం ఉన్నట్లు సమాచారం అందింది. అది రాహుల్ మృతదేహంగా గుర్తించి పోస్ట్మార్టంకు తరలించారు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కోరాడ విజయ్ కుమార్, కోగంటి సత్యం పాత్ర ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. రాహుల్ హత్యకు విజయవాడకు చెందిన రౌడీ షీటర్ కోగంటి సత్యం స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

శిక్షణ కూడా..
రాహుల్ను ఎలా హతమార్చాలి.? ఎవరిని రంగంలోకి దించాలి..? హత్య తర్వాత ఎలా వ్యవహరించాలి..? పోలీసులకు అనుమానం రాకుండా ఎలా ఉండాలనేదానిపై కోగంటి సత్యం నిందితులకు ట్రైనింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. హత్య తర్వాత పేరు బయటకు వస్తే ఎలా లొంగిపోవాలనేది కూడా కోరాడ విజయ్ కుమార్ కు కోగంటి సత్యమే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కోగంటి సత్యం 2019లో హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే..!

వాటా కోసమే..
రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు మేరకు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా కోరాడ విజయ్కుమార్, ఏ2గా కోగంటి సత్యం పేర్లు చేర్చారు. ముగ్గురు మహిళల ప్రేమేయం కూడా రాహుల్ హత్యలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హత్యతో పాత్రధారులుగా భావిస్తున్న పద్మజ అనే పేరుతో ఉన్న ఇద్దరు మహిళల పేర్లను కూడా ఏ3, ఏ4గా చేర్చారు. కోగంటి సత్యం ద్వారా ఫ్యాక్టరీ కొనుగోలుకు చర్చలు జరిగాయని... తన వాటా డబ్బుల కోసం కోరాడ విజయ్కుమార్ అనేకసార్లు ఒత్తిడి తెచ్చారని రాహుల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications