కృష్ణాజిల్లాలో విచిత్రం- ట్రంకు పెట్టెలో 5 లక్షలు తినేసిన చెద పురుగులు- బాధితుల గగ్గోలు
మన ఇళ్లలో చెదపురుగులు పట్టి పుస్తకాలు పాడయ్యాయనో, లేక బట్టలు కొరికేశాయనో వింటుంటాం. లేకపోతే చెక్కపెట్టెలు, అల్మారాలకు చెదలు పట్టడం కూడా చూస్తుంటాం. కానీ ఏపీలోని కృష్ణాజిల్లా మైలవరంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారి తాను కష్టపడి సంపాదించుకున్న ఐదు లక్షల రూపాయల కరెన్సీ నోట్లను ట్రంకు పెట్టెలో దాచుకుని.. కొంత కాలం తర్వాత తెరిచి చూస్తే మొత్తం చెదలు కొరికేశాయి. దీంతో ఆయన ఇప్పుడు లబోదిబో మంటున్నాడు. అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.

కృష్ణాజిల్లాలో కరెన్సీ నోట్లకు చెదలు
ఈ టెక్నాలజీ యుగంలో పల్లెటూర్లు, ఓ మోస్తరు పట్టణాల్లో సైతం జనం తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లోనో, ఇతరత్రా మార్గాల్లోనో దాచుకుంటున్నారు. కానీ ఇంకా ట్రంకు పెట్టెల్లో డబ్బు దాచుకునే మనుషులు కూడా అక్కడక్కడ మనకు దర్శనమిస్తుంటారు. కానీ ఏపీలోని కృష్ణాజిల్లా మైలవరంలో మాత్రం ఓ వ్యాపారి ఏకంగా ఐదు లక్షల రూపాయలు ట్రంకు పెట్టెలో దాచిపెట్టాడు. తీరా సమయానికి అవసరమై ట్రంకు పెట్టె తెరిచి చూస్తే చిత్తు కాగితాలు దర్శనమిచ్చాయి. ట్రంకు పెట్టెకు పట్టిన చెదలు ఇలా కరెన్సీ నోట్లను నాశనం చేశాయని తెలిసి ఇప్పుడు బాధితుడు లబోదిబోమంటున్నాడు.

ఇల్లు కట్టుకుందామని దాచిన సొమ్ము
మైలవరంలోని వాటర్ ట్యాంక్ వద్ద పందుల వ్యాపారం చేసుకునే బిజిలి జమలయ్య తన వ్యాపారంలో వచ్చిన లాభాలను బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో కుటుంబ సభ్యులను నమ్మలేక ట్రంకు పెట్టెలో దాచిపెట్టి భద్రం చేసుకున్నాడు. పది లక్షలు పోగు చేసి మంచి ఇల్లు కట్టుకుందామనుకున్నాడు. సుమారు 5 లక్షల రూపాయలు దాచిపెట్టాడు. అకస్మాత్తుగా వ్యాపారానికి ఒక లక్ష కట్టాల్సి వచ్చి రాత్రి తన ట్రంకు పెట్టె తెరిచాడు. లోపలున్న డబ్బులు చూసి బావురుమన్నాడు. నీరసంతో సొమ్మసిల్లి పడిపోయాడు.

పిల్లల ఆటలకూ పనికి రాని నోట్ల కట్టలు
ట్రంకు పెట్టెలో దాచిన డబ్బుకు చెదలు పట్టాయని తెలిసి బాధితుడు జమలయ్యతో పాటు కుటుంబ సభ్యులు ఆవేదనలో మునిగిపోయారు. ఇదే అదనుగా ఇంట్లో పిల్లలు వాటితో ఆడుకోవడం మొదలుపెట్టారు. అయితే పిల్లలు ఆడుకోవడానికి కూడా పనికి రానంతగా అవి చెదలు పట్టేశాయి. దీంతో పిల్లలు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు చివరికి పిల్లలు ఆడుకోవడానికి కూడా లేనంత దారుణంగా చెదలు తినేయడంపై జమలయ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజంగా సంపాదించిన డబ్బులేనా ?
ఉదయాన్నే ట్రంకు పెట్టెలో చెదలు పట్టిన డబ్బు తీసి మంచం పై వేసి జమలయ్యతో పాటు కుటుంబ సభ్యులు లెక్కపెట్టడం ప్రారంభించారు. విషయం చుట్టు ప్రక్కల వారికి తెలియడంతో ఆనోటా ఆనోటా పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జమలయ్య ఇంటికి వెళ్ళి ఆరా తీశారు. పోలీసులను చూడడంతోనే బావురుమంటూ తమ భాధ వెళ్ళగక్కారు జమలయ్య కుటుంబీకులు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. పోలీసులు మాత్రం అనుమానంతో ఈ డబ్బు వివరాలపై కూపీ లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications