రౌడీ షీటర్ అనుమానాస్పాద మృతి: ఆ తర్వాత జరిగిన గొడవలో ఫుట్బాల్ ఆటగాడు దారుణ హత్య
అమరావతి: విజయవాడలోని గురునానక్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి బార్లో జరిగిన గొడవలో ప్రత్యుర్థుల దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వాంబేకాలనీలో మంగళవారం ఉదయం అనుమానాస్పాద స్థితిలో రౌడీ షీటర్ శంకర్ అలియాస్ టోనీ అనే యువకుడు మృతి చెందాడు. ఇతని అంత్యక్రియల్లో జరిగిన వివాదమే పుట్బాల్ ప్లేయర్ ఆకాశ్ దారుణ హత్యకు దారితీసింది.
అనుమానాస్పాద స్థితిలో మృతి చెందిన టోనీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఈ నేపథ్యంలో టోనీ అనుచరులు అక్కడికి భారీగా చేరుకున్నారు. దగ్గరలోని ఓ బార్లో మద్యం సేవించేందుకు వీరంతా వెళ్లారు. వీరిలోనే రెండు గ్రూపులున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన జక్కంపూడికి చెందిన ఆకాశ్(23) అనే యువకుడికి, మరో వర్గానికి చెందినవారితో గొడవ జరిగింది. దీంతో అతను ప్రత్యర్థుల్లో ఒకరిని కొట్టాడు.
ఆ తర్వాత ఆకాశ్ను అక్కడున్నవారంతా బలవంతంగా గురునానక్ కాలనీలోని అతని స్నేహితుడి గదికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు 10 మందికిపైగా మద్యం, గంజాయి తాగి గురునానక్ కాలనీకి వచ్చారు. అదే సమయంలో ఆకాశ్ మద్యం మత్తులో నిద్రపోతున్నాడు. అతనితోపాటు మరో ముగ్గురు ఉండగా, ప్రత్యర్థులను చూసి ఇద్దరు పారిపోయారు. అక్కడున్న మరో వ్యక్తిని బెదిరించి బయటకు పంపించేశారు.
అనంతరం ఆకాశ్ను దారుణంగా పొడిచి చంపారు. అరగంట తర్వాత పారిపోయిన స్నేహితులు వచ్చి రక్తపు మడుగులో ఉన్న ఆకాశ్ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే ఆకాశ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు.
ఆకాశ్ మృతదేహంపై 16 చోట్ల కత్తి పోట్లు ఉన్నట్లు తెలిసింది. ఆకాశ్ మరణించాడని తెలిసి అతని స్నేహితులు 50 మంది ఆస్పత్రికి చేరుకున్నారు. రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ ప్లేయర్ అయిన ఆకాశ్కు తల్లిదండ్రులు, సోదరి ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.