అదానీ చేతికి గంగవరం పోర్టు- రూ.3604 కోట్లతో- 89.6 శాతం వాటా కైవసం
ఏపీలోని కీలక పోర్టుల్లో ఒకటైన విశాఖపట్నంలోని గంగవరం పోర్టులో మెజారిటీ వాటాను పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ పోర్ట్స్ తాజాగా కొనుగోలు చేసింది. రూ.3604 కోట్ల రూపాయలతో గంగవరం పోర్టులోని 58.1 శాతం వాటాను అదానీ గ్రూప్ చేజిక్కించుకుంది. ఈ ఒప్పందాన్ని ఏపీ సర్కార్ కూడా స్వాగతించింది. రాష్ట్రానికి మేలు చేసే నిర్ణయంగా పేర్కొంది. పోర్టులో ప్రభుత్వ వాటా మాత్రం కొనసాగుతుందని పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రకటించారు. రెగ్యులేటరీ అనుమతులు వచ్చాక అధికారికంగా ఈ యాజమాన్య మార్పిడి అమల్లోకి వస్తుంది.
అదానీ చేతికి గంగవరం పోర్టు
దేశంలో అతిపెద్ది ప్రైవేటు పోర్టులు, లాజిస్టిక్స్ నిర్వహిస్తున్న సంస్ధ అదానీ గ్రూప్కు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, గంగవరం పోర్టు లిమిటెడ్లో డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి చెందిన 58.1 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీని విలువ రూ.3604 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. త్వరలో రెగ్యులేటరీ అనుమతులు కూడా లభిస్తే గంగవరం పోర్టు యాజమాన్యం అధికారికంగా చేతులు మారనుంది. ఏపీలోని పోర్టుల్లో ఓ కీలక ఒప్పందంగా దీన్ని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అదానీ పోర్ట్స్ చేతికి 89.6 శాతం వాటా
ఈ నెల 3న గంగవరం పోర్టులో వాటా కలిగి ఉన్న వార్బర్గ్ పిన్కస్ నుంచి 31.5 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ పోర్ట్స్కు చెంన ఏపీ ఎస్ఇజెడ్ సంస్ధ ప్రకటించింది. ప్రస్తుతం డీవీఎస్ రాజుకు చెందిన గంగవరం పోర్ట్ లిమిలెడ్ జీపీఎల్లో తాజాగా తీసుకున్న 58.1 శాతం వాటా కూడా కలుపుకుంటే అదానీ పోర్ట్స్కు 89.6 శాతం వాటా లభించినట్లవుతుంది. అంటే దాదాపు 90 శాతం వాటాను గంగవరం పోర్టులో అదానీ గ్రూప్ కొనుగోలు చేసిందన్నమాట. మిగిలిన పది శాతం ఏపీ ప్రభుత్వ వాటా ఉంటుంది.
గంగవరం పోర్టు కొనుగోలుపై అదానీ ట్వీట్
"భవిష్యత్తును రూపొందించడంలో ఓడరేవులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. గంగవరం ఓడరేవులో ఏపీ ఎస్ఇజ్ యొక్క 89.6 శాతం వాటా ద్వారా, అదానీ గ్రూప్ తన పాన్-ఇండియా కార్గో ఉనికిని బాగా విస్తరిస్తుంది. భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ పోర్ట్ డెవలపర్, ఆపరేటర్గా, మేం భారతదేశ, ఏపీ పారిశ్రామికీకరణలో కీలక అడుగు వేస్తున్నట్లు అదానీ గ్రూప్ చైర్మన్, వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. దీంతో గంగవరం పోర్టు కొనుగోలు ద్వారా పారిశ్రామికీకరణలో అదానీ గ్రూప్ మరో భారీ డీల్ పూర్తి చేసినట్లయింది.
గంగవరం పోర్టు ప్రత్యేకతలివే...
ఏపీలోని రెండో అతిపెద్ద నాన్ మేజర్ పోర్టు అయిన గంగవరం పోర్టు వైజాగ్ పోర్టుకు అతి సమీపంలోనే ఉంది. దీని సామర్ధ్యం 64 ఎంఎంటీ. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ పోర్టుపై 2059 వరకూ వాటా దారులకు ఆధిపత్యం ఉంటుంది. ఇది అన్నిరకాల వాతావరణం, లోతైన నీరు, 200,000 DWT వరకు పూర్తిగా నిండిన సూపర్ కేప్ సైజు నాళాలను నిర్వహించగల బహుళార్ధ సాధక ఓడరేవు. ప్రస్తుతం, గంగవరం పోర్టులో 9 బెర్త్లులు ఉన్నాయి. 1,800 ఎకరాల ఫ్రీహోల్డ్ భూమి కూడా దీని సొంతం. 31 బెర్త్లతో 250 ఎమ్ఎమ్టిపిఎ మాస్టర్ ప్లాన్ సామర్థ్యంతో, భవిష్యత్ వృద్ధికి తోడ్పడటానికి గంగవరం పోర్టుకు తగినంత హెడ్రూమ్ కూడా ఉందని సంస్ధ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్, షుగర్, అల్యూమినా మరియు స్టీల్తో సహా పొడి మరియు భారీ వస్తువుల మిశ్రమాన్ని గంగవరం పోర్టు నిర్వహిస్తోంది. తూర్పు, దక్షిణ, మధ్య భారతదేశంలోని 8 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న ప్రాంతానికి గంగవరం పోర్టు ఓ ముఖద్వారం వంటిది కూడా.