ఫోన్ ట్యాపింగ్లో ట్విస్ట్లు- హైకోర్టు వ్యాఖ్యలతో కలకలం- టీడీపీ కోరుకుంటోంది ఇదేనా..?
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారిపోతోంది. విపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ అంటూ ఆరోపణలు ప్రారంభించిన టీడీపీ, ఆ తర్వాత న్యాయమూర్తులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, డాక్టర్లు కూడా బాధితులే అంటూ మరో కొత్త స్వరం అందుకుంది. దీంతో ఈ వ్యవహారం హైకోర్టు వరకూ వెళ్లింది. తొలి విచారణలోనే హైకోర్టు ఈ వ్యవహారం చాలా సీరియస్, దర్యాప్తు అవసరం అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కానీ అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలతో అఫిడవిట్ వేయాలని పిటిషనర్కు సూచించింది.

ట్యాపింగ్ కలకలం...
ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం కంటే ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపుతోంది. రాజధానులపై ఓవైపు హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉండటంతో ఈ వ్యవహారం తేలేందుకు మరికొంత సమయం పడుతుందని భావిస్తుండగా.. తాజాగా టీడీపీ ఆరోపిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. తొలుత విపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ మాత్రమే ఆరోపణలు చేసిన టీడీపీ ఇప్పుడు ఈ వ్యవహారంలోకి న్యాయమూర్తులు, సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు, జర్నలిస్టులు ఇలా అందరికీ లాగేస్తోంది. అదే సమయంలో ఫోన్ ట్యాపింక్పై దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ శ్రావణ్ కుమార్ అనే న్యాయవాదితో హైకోర్టులో పిటిషన్ కూడా వేయించింది.

హైకోర్టు వ్యాఖ్యలతో ...
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ వ్యవహారం తీవ్రతను మరింత పెంచాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ ఐపీఎస్ అధికారి, హోం సెక్రటరీ, సీఎస్ల ప్రమేయంతోనే ట్యాపింగ్ జరిగినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. ముఖ్యంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్ తీవ్రమైన విషయమని, ఇందులో దర్యాప్తు అవసరమని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో ఇప్పుడు ఆధారాలపైనే అందరి దృష్టీ నెలకొంది.

ఆధారాలు దొరికేనా ?
సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఆధారాల సేకరణ అంత సులువు కాదు. టెలికాం ఆపరేటర్లు, కేంద్ర ప్రభుత్వం ఇలా పలువురి జోక్యం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ట్యాపింగ్ చేయించినట్లు ఆధారాలు దొరకడం సాధ్యం కాదు. నిజంగా అలా దొరికితే మాత్రం దేశంలోనే అదో సంచలనం అవుతుంది. కానీ పిటిషనర్ ఓ పత్రిక కథనం ఆధారంగా సీబీఐ దర్యాప్తు కోరుతున్నప్పుడు హైకోర్టు కూడా ఆధారాల గురించే పదే పదే ప్రశ్నించింది. కానీ పిటిషనర్ మాత్రం అదనపు అఫిడవిట్లో వీటిని దాఖలు చేస్తానని మాత్రమే హామీ ఇచ్చారు. రేపు ఈ పిటిషన్పై మరోసారి హైకోర్టు విచారణ జరపాల్సి ఉంది. ఇందులో ఆధారాలు లభించకపోతే ప్రాధమిక స్దాయిలోనే దీన్ని తోసిపుచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.

టీడీపీ కోరుకుంటున్నది ఇదేనా..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంపై అధికారులపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఇందులో ఏం కోరుకుంటోందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలు లభించడం కష్టమనీ తెలుసు, కేంద్రం జోక్యం చేసుకునే పరిస్ధితి లేదని బీజేపీ నేతలే చెబుతున్నారు, కానీ టీడీపీ మాత్రం హైకోర్టులో సీబీఐ విచారణ ఆదేశాలు కోరుకుంటోంది. ఇదంతా సాధ్యమవుతుందా అంటే అవునని చెప్పలేని పరిస్ధితి. దీంతో టీడీపీ ఈ వ్యవహారంలో అంతిమంగా సాధ్యమైనంత ఎక్కువగా చర్చ జరగాలని మాత్రమే కోరుకుంటున్నట్లు తేలిపోతోంది. న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ పేరుతో జరిగే చర్చ దేశవ్యాప్తంగా ప్రచారానికి దారి తీస్తుంది. ఇందులో ఆధారాలు లభించకపోయినా వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతినడం ఖాయం. దీంతో రాజకీయంగా లబ్ది కోసమే టీడీపీ ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చినట్లు అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications