వైఎస్ జగన్ చేతుల మీదుగా అవార్డులను అందుకోబోయే వలంటీర్లు వీరే.. సీఎం సభ షెడ్యూల్ ఇదే
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తోన్న వార్డు, గ్రామ వలంటీర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్కరించనున్నారు. వారికి అవార్డులను అందజేయనున్నారు. నగదు ప్రోత్సాహకాలను ప్రదానం చేయనున్నారు. విధి నిర్వహణలో అత్యుత్తమ పనితీరును కనపరిచిన తొమ్మిది మంది వలంటీర్లకు వైఎస్ జగన్ అవార్డులను అందజేస్తారు. దీనికోసం కృష్ణాజిల్లా పెనుమలూరు నియోజకవర్గం పరిధిలోని పోరంకిలో గల మురళీ రిసార్ట్స్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉదయం 10:35 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమౌతుంది.
ఉగాది సందర్భంగా అవార్డులు..
సంక్షేమ పథకాల అమలు వేగవంతం కావడానికి, ప్రజలకు అవసరమైన అన్ని రకాల సర్టిఫికెట్లను వారి గడప వద్దకే అందించేలా, వాటిని జారీ చేయడంలో ఎక్కడా అవినీతికి అవకాశం ఇవ్వని విధంగా వలంటీర్ల వ్యవస్థ కొనసాగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. వారిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అవార్డుల, నగదు బహుమతులను అందజేయాలని నిర్ణయించింది. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని వలంటీర్లకు అవార్డులను అందజేస్తామని ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనపై మంత్రివర్గం ఓ తీర్మానాన్ని కూడా ఆమోదించింది.
15 రోజుల పాటు..
వలంటీర్లకు అవార్డులను అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈ ఉదయం లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 28వ తేదీ వరకు దీన్ని కొనసాగిస్తారు. జిల్లాకు చెందిన మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, మున్సిపల్ ఛైర్మన్లు, సంబంధిత శాఖల అధికారులు ఇందులో పాల్గొంటారు. వలంటీర్ల పనితీరు ఆధారంగా సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులను ప్రభుత్వం అందజేస్తుంది. 10 వేల నుంచి 30 వేల రూపాయల వరకు నగదు బహుమతి, పతకం, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జిలను వలంటీర్లకు ప్రదానం చేస్తుంది. తొలిరోజు 11 జిల్లాల పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి.
జగన్ చేతుల మీదుగా అవార్డులను అందుకోబోయేది వీరే..
వైఎస్ జగన్ తొమ్మిది మందికి అవార్డులు ప్రదానం చేస్తారు. కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన ఎన్ రాజేష్, పీ ప్రత్యూష, కానూరు వలంటీర్లు షేక్ నూర్జహాన్, వీ భవాని, సాజిదాబేగంలకు సేవావజ్ర, కొడాలి నవీన్, జీ వలిలకు సేవారత్న, బిందుప్రియ, చోడవరానికి చెందిన గోపిబాబుకు సేవా మిత్ర అవార్డులను అందజేస్తారు. ఇదే రోజు 13 జిల్లాల్లో ఎంపిక చేసిన ఒక్కో నియోజకవర్గంలో అవార్డుల ప్రదానం కొనసాగుతుంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల వల్ల చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఈ కార్యక్రమం వాయిదా పడింది.
వైఎస్ జగన్ షెడ్యూల్ ఇదే..
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వైఎస్ జగన్ 10:15 నిమిషాలకు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరుతారు. 10:35 నిమిషాలకు పోరంకికి చేరుకుంటారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వలంటీర్లు చేసిన సేవలపై చిత్రీకరించిన డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొన్న అనుభవాలను వెల్లడించడానికి ఇద్దరు వలంటీర్లకు అవకాశం కల్పిస్తారు. అనంతరం వైఎస్ జగన్ ప్రసంగం ఉంటుంది. అనంతరం తొమ్మిదిమంది వలంటీర్లకు ఆయన సత్కరిస్తారు. వార్డు, గ్రామ సచివాలయాలు, వలంటీర్ల విభాగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పలువురు అధికారులు ఇందులో పాల్గొంటారు.