గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులకు కరోనా వ్యాక్సిన్: మంత్రి ఆదిమూలపు కూడా
విజయవాడ: దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ సోమవారం ఆరంభమైంది. 60 సంవత్సరాలకు పైగా వయస్సున్న వృద్ధులు, వేర్వేరు అనారోగ్య కారణాలతో బాధపడుతోన్న 45 సంవత్సరాలు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ అందజేస్తోన్నారు. దీనికోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను ముందుండి వ్యాక్సిన్ వేయించుకున్నారు. టీకా తీసుకుని.. రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయనే ప్రారంభించారు. అదేరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు, పలువురు కేంద్రమంత్రులు సైతం టీకాను తీసుకున్నారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి: తెలంగాణలో ఎన్ని కేంద్రాల్లో టీకా
తాజాగా- ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, లేడీ గవర్నర్ సుప్రవ గవర్నర్కు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. వారికి విజయవాడ ప్రభుత్వ సార్వత్రిక ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేశారు.
ఈ ఉదయం గవర్నర్ దంపతులు విజయవాడ జీజీహెచ్కు చేరుకున్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్ మహ్మద్ ఇంతియాజ్, జీజీహెచ్ డాక్టర్లు, నర్సులు వారికి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వ్యాక్సినేషన్ విభాగంలో వారికి ఇంజెక్షన్ ఇచ్చారు. తొలుత గవర్నర్, అనంతరం లేడీ గవర్నర్కు వ్యాక్సిన్ వేశారు. ఇది వారికి తొలి డోసు. కొద్దిసేపు అక్కడే విశ్రాంతి తీసుకున్న తరువాత రాజ్భవన్కు బయలుదేరి వెళ్లారు.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ సజావుగా సాగుతోందని అన్నారు. రెండోదశ వ్యాక్సినేషన్ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను తమ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ పనితీరు పట్ల ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు వ్యాక్సిన్ తీసుకున్నారని అన్నారు.