రాఖీ పండుగ గిఫ్ట్: మహిళల రక్షణ కోసం మరో ప్రోగ్రామ్: కాస్సేపట్లో ప్రారంభించనున్న వైఎస్ జగన్
అమరావతి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడానికి, వారికి భరోసా ఇవ్వడానికి మరో వినూత్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే దిశ చట్టం, కేసుల నమోదు కోసం ప్రత్యేకంగా యాప్, మహిళల కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం.. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని నెలరోజుల పాటు అవగాహన కార్యక్రమాలను చేపట్టనుంది.
Recommended Video
వాటర్ ల్యాండింగ్: చరిత్ర సృష్టించిన నాసా: భూమిపై వ్యోమగాములు: స్పేస్ఎక్స్ క్యాప్సుల్
కొత్తగా ఇ-రక్షాబంధన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభిస్తారు. రాష్ట్ర పోలీసులు, సైబర్ క్రైమ్, సైబర్ పీస్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. సైబర్ నేరాలపై మహిళలకు అవగాహన కల్పించడానికి నెలరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సమావేశాలను నిర్వహిస్తారు. ఏపీ సీఐడీకి చెందిన అధికారిక యూట్యూబ్ ద్వారా వాటిని ప్రసారం చేస్తారు.
వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫాంలను ఆధారంగా చేసుకుని కొందరు అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నారు. అలాంటి వారి పట్ల యువతులు ఎలా అప్రమత్తంగా ఉండాలనే విషయాలపై ఈ నెలరోజుల పాటు అవగాహన కల్పిస్తారు. అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వల్ల ఎదుర్కొనే శిక్షలపై యువకులను వివరించే కార్యక్రమాలను ఈ సందర్భంగా చేపడతారు.
దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్పై నిపుణులతో చర్చాగోష్ఠీలను ఏర్పాటు చేస్తామని, వాటిని తమ యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తామని సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ పీవీ సునీల్ కుమార్ తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాల పట్ల యువతీ యువకుల్లో అవగాహన కల్పించడం, అమ్మాయిలకు అశ్లీల ఫొటోలు, వీడియోలను పంపించడం వల్ల పడే శిక్షల గురించి వివరించడం వంటి చర్యలను తీసుకుంటామని తెలిపారు. దీనికి సంబంధించి ఓ సమగ్ర కార్యక్రమాన్ని రూపొందించామని, రక్షాబంధన్ను పురస్కరించుకుని వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.