ఆర్ధిక కష్టాల్లో ఉన్న ఏపీకి మూడు రాజధానులతో ఆర్ధిక భారం పెరగదా ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
తెలుగు రాష్ట్రాల విభజన తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుదేలైంది. ఆర్థిక భారంతో ముందుకు సాగలేక ఇబ్బంది పడుతోంది. విభజన సమయంలో ఇచ్చిన హామీలు నేటివరకు నెరవేరక పోవడం, తెలంగాణ రాష్ట్రం నుండి రావలసిన వనరులు,ఆదాయం ఏపీకి ఇంకా చేరకపోవడం, కేంద్ర ఈ విషయంలో పెద్దగా పట్టించుకోకపోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాలలోకి నెట్టేసింది. ప్రత్యేక హోదా ఇస్తే కాస్త కష్టాలనుంచి గట్టెక్కవచ్చు అని భావించినప్పటికీ ప్రత్యేక హోదా అంశం నీటి మీద రాతలాగే మారిపోయింది. ఇక అసలే ఆర్థికంగా ఒడిదుడుకులతో ఇబ్బందిపడుతున్న ఏపీపై అనూహ్యంగా ఏపీ సర్కార్ మరో అతిపెద్ద భారాన్ని పెట్టబోతోంది అన్న చర్చ ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ రాజధాని అమరావతి మార్పుపై కేంద్రం జోక్యం చేసుకుంటుందా ? భిన్నవాదనలు
విభజన నాటి నుండి ఎపీకి ఆర్ధిక కష్టాలే ..
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నాటి నుండి నేటి వరకు ఏపీలో పరిస్థితులు చూస్తే గతంలో అధికారంలో ఉన్న టీడీపీ హయాంలో అసలు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏర్పాటు చేయడానికి,ఒక రూపం ఇవ్వడానికి చంద్రబాబు తన వంతు ప్రయత్నం చేశారు. రాజధానిగా అమరావతిని ప్రకటించి 33 వేల ఎకరాల భూములను రైతుల వద్ద నుండి సేకరించి రాజధానిలోని భవనాల నిర్మాణాన్ని చేపట్టారు. అందులో అక్రమాలు, అవకతవకల విషయం అటుంచితే ఆర్ధిక కష్టాలతో చంద్రబాబు హయాంలోనూ చాలా ఇబ్బందులు పడ్డారు.లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని ముందుకు నడపాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు .
వైసీపీ హయాంలో నవరత్నాల అమలుపై దృష్టి .. పెరిగిన ఆర్ధికభారం
గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడంతో సీన్ రివర్స్ అయ్యింది. అధికారంలోకి వైసిపి వచ్చింది. ఆ తర్వాత రాజధాని నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఏపీకి, రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చిన బ్యాంకులు సైతం చేతులెత్తేశాయి. విపరీతమైన ఆర్ధిక నష్టాలతో అధికారం చేపట్టిన జగన్ సర్కార్ ప్రజలకిచ్చిన నవరత్నాల హామీల అమలుపై దృష్టి సారించి ఏపీ ఆర్థిక భారాన్ని మరింత పెంచేసింది .
మూడు రాజధానుల ప్రకటన మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందమే అని చర్చ
ఇప్పటికే ఆర్థిక వనరులు లేక మూలుగుతున్న ఏపీ ఖజానాపై సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానులు ప్రకటన మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఉంటుంది అన్న భావన ఏపీ ప్రజల్లో వ్యక్తమౌతుంది. రాజధాని అమరావతి నిర్మాణం చేయడానికే ఆర్థిక వనరులు లేక కింద మీద పడుతున్న ఏపీ సర్కార్ మూడు రాజధానుల నిర్మాణం చేయగలుగుతుందా ? మూడు ప్రాంతాల్లో రాజధానులను నిర్మించి అధికార వికేంద్రీకరణ చెయ్యడం అంటే అత్యంత శ్రమతో, ఆర్థిక వ్యయంతో కూడుకున్న పని అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
15వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చెప్పుకున్న సీఎం
ఇక ఇలాంటి సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకోబోయే మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాదు అన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిన్నటికి నిన్న 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్ మోహన్ రెడ్డి విభజన గాయాలు మానలేదు అని, ఆర్థిక భారంలో కూరుకు పోయామని , ఉదారంగా సహాయం అందించాలని కేంద్రానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని 15వ ఆర్థిక సంఘం ముందు పూసగుచ్చినట్టు ఉంచారు.
మూడు రాజధానుల ఏర్పాటు మరింత ఆర్ధిక భారమే ..
ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటారని భావిస్తున్న నిర్ణయం, చేసిన ప్రకటన, ప్రస్తుత ఏపీ పరిస్థితులు ఏపీని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఇలాంటప్పుడు సీఎం జగన్ ని ఎందుకు ఇలాంటి ప్రకటన చేశారు. అధికారం చేపట్టిన ఏడు నెలలకే రాష్ట్రంలో ఒక రాజకీయ అనిశ్చిత వాతావరణాన్ని ఎందుకు సృష్టించుకున్నారు అన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న.
ఇప్పటికే గుల్లైన ఖజానా ..ఈ ప్రకటనతో మరింత సంక్షోభం
ఏది ఏమైనా మూడు రాజధానులతో ఆర్థిక భారం పెరుగుతుంది అన్నది అందరూ ఏకకంఠంతో ఒప్పుకుంటున్న విషయం. ఇప్పటికే ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన చేపట్టిన నాటి నుండి అందిస్తున్న వివిధ పథకాలు ఖజానాను గుల్ల చేస్తున్నాయి. ఇక ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని ఎక్కడికి తీసుకు వెళుతుందో అన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా జరుగుతుంది.