పులివెందులను రాజధాని చేసుకో.. మీకు కలిసివస్తుంది: సీఎం వైఎస్ జగన్పై పవన్ కళ్యాణ్ సెటైర్లు
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధానిని పులివెందులకు మార్చుకుంటే నయమని జగన్మోహన్ రెడ్డికి చురకలంటించారు.

పులివెందుల అయితే మీకు కలిసొస్తుంది..
కర్నూలులో హైకోర్టు పెడితే పులివెందుల నుంచి వెళ్లి రావడం సులువుగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఖర్చు కూడా తగ్గుతుందని ఎద్దేవా చేశారు.

ఆ విషయం సీఎంకు తెలియదా?
ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు మార్పుపై ప్రజా వ్యతిరేకత చూసి ఆ జీవో సంగతి తనకు తెలియదని సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఆ జీవో ఇచ్చిని వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అంతమంది సీఎంలు ఉంటే.. ఏమవుతుంది.?
ఒక ప్రభుత్వానికి ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు ఐదుగురి చొప్పున ఉంటే ఇలానే ఉంటుంది.. ఏ ముఖ్యమంత్రి జీవో జారీ చేశాడో తెలుసుకోవడానికి ఒక శుక్రవారం పడుతుందని జనసేన శతాఘ్ని టీం సెటైర్ వేసింది.

పార్టీ పరిస్థితిపై నేతలతో సమీక్ష
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నేతలతో పవన్ కళ్యాణ్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్విహించారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, భవిష్యత్లో పార్టీ బలోపేతానికి చేపట్టబోయే కార్యక్రమాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం గాజువాక కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. నేతలు, కార్యకర్తలకు పలు కీలక సూచనలు, సలహాలు చేశారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

నిన్న సినిమాలపై క్లారిటీ ఇచ్చిన పవన్
తాజాగా, పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావడంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, తనకు తెలిసింది ఒక్క సినిమానేనని ఆయన అన్నారు. అంతేగాక, తాను సినిమాల్లో చేస్తానో లేదో తెలియదు కానీ.. ప్రొడక్షన్ మాత్రం చేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి అవంతిపై విమర్శలు గుప్పించారు. అవంతి.. కాలేజీలు మూసేసి రాజకీయాల్లో ఉన్నారా? అని ప్రశ్నించారు. అలాగే జగన్మోహన్ రెడ్డడికి జగతి పబ్లికేషన్స్, భారత సిమెంట్స్ లాంటి వ్యాపారాలున్నాయి కాదా..? అని నిలదీశారు.

151 ఎమ్మెల్యులుంటే ఏంటీ?.. మాకు ఒక్కటే ఉన్నా..
అధికారంలో ఉన్న వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏంటి?.. 175 మంది ఎమ్మెల్యేలుంటే ఏంటీ..? జనసేనకు ఒక్క ఎమ్మెల్యే చాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కేసులు ఉన్న మీరే(వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి) తెగించి సమాజంలో తిరుగుతున్నప్పుడు.. ఆశయాలున్న తాము తిరిగితే తప్పేంటని ప్రశ్నించారు.. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ.. ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీ జనసేనతో గొడవ పెట్టుకుంటోందన్నారు. ప్రజల్లో ఎవరికి బలం ఉందో తెలుస్తుందన్నారు.












Click it and Unblock the Notifications