దిశ స్ఫూర్తితో దివ్య కేసులో ఏడు రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం : ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్
ఏపీలోని విజయవాడలో నిన్న జరిగిన దివ్య తేజస్విని హత్యపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం చాలా బాధాకరమైన ఘటనగా ఆయన పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. ఇదే సమయంలో ఇటువంటి దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరికలు జారీ చేశారు.
ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు దేనికోసం .. మొన్న చిన్నారి, నేడు దివ్య తేజస్విని : పవన్ కళ్యాణ్ ఫైర్
దిశ స్ఫూర్తిగా 7 రోజుల్లో ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. సిపి స్వీయ పర్యవేక్షణలో దర్యాప్తు జరిగేలా ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆయన వెల్లడించారు . చిన్నారులపై, మహిళలపై దాడులకు పాల్పడితే ఎట్టిపరిస్థితుల్లోనూ పోలీస్ శాఖ ఉపేక్షించదని పేర్కొన్న ఏపీ డీజీపీ సమాజంలో జరుగుతున్న ఇటువంటి వింత పోకడలను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని స్పష్టం చేశారు.
క్రీస్తురాజపురానికి చెందిన దివ్య తేజస్విని అనే ఇంజనీరింగ్ విద్యార్థినిని నాగేంద్ర అనే యువకుడు గురువారం కత్తితో గొంతు కోసి హత్య చేశారని, ఆపై తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని తెలుస్తుంది.
Recommended Video
అయితే ఈ కేసులో తాజాగా ఒక కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది . తాను దివ్య గొంతు కోయ లేదని, తామిద్దరూ ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే ఎవరి గొంతు వాళ్లు కోసుకున్నామని నాగేంద్ర చెప్తున్నాడు. తనకు దివ్యకు పెళ్లయిందని తమ పెళ్లి ఇంట్లో పెద్దలు అంగీకరించని కారణంగా దివ్య, తను చనిపోదామనుకుని ఎవరి గొంతు వాళ్ళు కోసుకున్నాం అంటూ నాగేంద్ర వాంగ్మూలం ఇచ్చారు. రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసును త్వరితగతిన ఛేదించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.