ఏపీలో పరీక్షల రగడ : టీడీపీ ఫైట్ , జగన్ సర్కార్ నిర్ణయంపై తల్లిదండ్రుల పిల్, హైకోర్టులో పంచాయితీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోటెన్త్,ఇంటర్ పరీక్షల రగడ చిలికి చిలికి గాలివానగా మారింది.పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్ష టిడిపితో పాటుగా కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు,పరీక్షలు కొనసాగించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో ఈ వ్యవహారం కాస్త కోర్టు మెట్లెక్కింది. న్యాయస్థానంలో ఈ ఎగ్జామ్స్ వార్ ఏ మలుపు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

పరీక్షలు రద్దు చెయ్యాలని తల్లిదండ్రుల ప్రజా ప్రయోజన వ్యాజ్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని కోర్టు దృష్టికి తీసుకు వెళ్తున్నారు. కనీసం పరీక్షలు వాయిదా వేసే ఆలోచన చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పరీక్షలు వద్దని కోర్టు మెట్లెక్కిన టీడీపీ
ఇదిలా ఉంటే ఇప్పటికే కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించవద్దని, పరీక్షను రద్దు చేయాలని కోరుతూ టిడిపి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేయడమే కాకుండా,పరీక్షలు నిర్వహించకుండా ఈ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు.అంతేకాదు విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మాట్లాడి టిడిపి అభిప్రాయ సేకరణ చేసింది.ఎక్కువ మంది విద్యార్థుల తల్లిదండ్రులు కరోనా నేపథ్యంలో భయపడుతున్నారని, ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే వారి ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.సీఎం జగన్ ను పరీక్షలు రద్దు చేసి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని, మంచి మేనమామ అనిపించుకోవాలని పదేపదే విజ్ఞప్తి చేశారు.

ఏపీలో పరీక్షలు వద్దంటూ కేఏ పాల్ సైతం కోర్టులో పిటీషన్
మరోవైపు టిడిపి కూడా కోర్టులో పరీక్షల రద్దు కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధం అవుతుంది. ఇదిలా ఉంటే పది,ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలంటూ కె ఏ పాల్ సైతం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తుంటే, పరీక్షలు నిర్వహించడం వల్ల ఏపీలో కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు భరోసా ఇస్తారంటూ మండిపడ్డారు. విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏపీలో పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కెఏ పాల్. అయితే ఇంత పెద్ద ఎత్తున ప్రతిపక్ష టీడీపీ పరీక్షల రద్దుకు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వవాదన మాత్రం వేరేలా ఉంది.

పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసిన సీఎం జగన్
పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయమని చెప్పడం సులభమని, కానీ అలా చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఉన్నత చదువుల కోసం ప్రయత్నించినా ఉద్యోగాల వేటలో ఇంటర్వ్యూకి వెళ్ళినా పదో తరగతి, ఇంటర్మీడియట్ లోని పరీక్షల మార్కులను పరిగణలోకి తీసుకుంటారని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామని, అన్నికరోనా జాగ్రత్తలు తీసుకొనే పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి భరోసా కల్పిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పరీక్షలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.
Recommended Video

పరీక్షల రద్దుకై కోర్టులో దాఖలైన పిటీషన్లపై సర్వత్రా ఉత్కంఠ
ఈ సమయంలో కోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలతో,అసలు పరీక్షలు జరుగుతాయా లేదా అన్న అనుమానం అందరిలో వ్యక్తమౌతుంది. ఇటు విద్యార్థులు సైతం తాజా పరిణామాలతో గందరగోళానికి గురవుతున్నారు.ఇదే సమయంలో కరోనా వ్యాప్తి నేపధ్యంలో తీవ్రంగా భయాందోళన మధ్య ఉన్నారు. ఏది ఏమైనా పట్టిన పట్టు వదలకుండా పరీక్షలకు వెళ్లనున్న ప్రభుత్వతీరుతో ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. మరి ఏపీ హైకోర్టు ఈ కేసుల విచారణలో పరీక్షల నిర్వహణపై ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications