ఏపీలో ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లపై కొరడా- విజయవాడలో ఐదు ఆస్పత్రుల అనుమతి రద్దు...
విజయవాడ స్వర్ణప్యాలెస్ దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. అనుమతులు, సౌకర్యాల కల్పన విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో విజయవాడతో పాటు పలుచోట్ల ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్ల ఆగడాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో వీటి విషయంలో చర్యలు ప్రారంభించింది.
విజయవాడలో ఐదు ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లకు గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇందులో నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూ, అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రులు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో రమేష్ ఆస్పత్రి నిర్వహిస్తున్న స్వర్ణ హైట్స్, డాక్టర్ లక్ష్మీ నర్సింగ్ హోమ్ వారి ఎనికేపాడులోని హోటల్ అక్షయ, బ్రిటిష్ హాస్పిటల్ వారు నిర్వహిస్తున్న బెంజిసర్కిల్లోని హోటల్ ఐరా, ఎన్నారై హీలింగ్ హ్యాండ్స్, ఆంద్రా హాస్పిటల్ వారి సన్ సిటీ, కృష్ణ మార్గ్ కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతులు రద్దు చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video
నగరంలోని రోగుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకే ఈ ఐదు కోవిడ్ కేర్ సెంటర్లకు గతంలో ఇచ్చిన అనుమతులు రద్దు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే తాజాగా స్వర్ణప్యాలెస్ ఘటనపై విచారణ సందర్భంగా హైకోర్టు.. తనిఖీలు చేసి అనుమతులు ఇచ్చిన అధికారులను ఎందుకు ఈ కేసులో నిందితులుగా చేర్చలేదని ప్రశ్నించిన నేపథ్యంలో అధికారులు ఈ తక్షణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదే కోవలో రాష్టంలో మరికొన్ని చోట్ల కూడా నిబంధనలకు విరుద్దంగా పనిచేస్తున్న కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులను రద్దు చేసే దిశగా ప్రభుత్వం పయనిస్తోంది.