విజయవాడలో ప్రైవేటు కోవిడ్ సెంటర్ల మూసివేత- అనుమతిచ్చిన వారిపై త్వరలో చర్యలు...
విజయవాడలో స్వర్ణప్యాలెస్ ఘటనలో రమేష్ ఆస్పత్రి నిర్లక్ష్యం ఉన్నట్లు తేల్చిన ప్రభుత్వం మిగతా ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లపైనా దర్యాప్తు చేయించింది. ఇందులో ఏ ఒక్క ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్లోనూ ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు లేవని తేలడంతో అన్నింటినీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్ధానిక జిల్లా వైద్యాధికారి రమేష్ ఉత్తర్వులు ఇచ్చారు.
స్వర్ణప్యాలెస్ ఘటనపై దర్యాప్తు సందర్భంగా మిగతా ఆస్పత్రుల్లో సదుపాయాలపైనా ప్రభుత్వం విచారణ చేపట్టింది. ప్రభుత్వం నియమించిన రెండు కమిటీల్లో ఒకటి స్వర్ణప్యాలెస్లో సదుపాయాలపైనా, మరో కమిటీ మిగతా అన్ని కోవిడ్ కేర్ సెంటర్లపైనా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందులో అన్ని ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లలోనూ సదుపాయాల కొరత ఉందని, భద్రతా ప్రమాణాలు సరిగా లేవని గుర్తించింది. డాక్టర్ల బృందం పరిశీలనలో లోపాలు ఉన్నట్లు తేలడంతో వీటికి గతంలో జారీ చేసిన అనుమతులను రద్దు చేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ రమేష్ తెలిపారు.
Recommended Video
గతంలో విజయవాడలో మొత్తం 22 కోవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు వీటి అనుమతులన్నీ రద్దు చేశారు. తక్షణం వీటిని మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. రోగులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించనున్నారు. మరోవైపు స్వర్ణప్యాలెస్ ఘటనలో రమేష్ ఆస్పత్రిపై మాత్రంపై చర్యలు తీసుకుంటూ కోవిడ్ కేర్ సెంటర్కు అనుమతిచ్చిన అధికారులను వదిలివేయడంపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఇప్పుడు ఈ 22 కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతిచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తన సర్వీసులో చివరి రోజైన ఇవాళ డీఎంహెచ్వో రమేష్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.