ఏపీలో ప్రైవేటు ఆస్పత్రులకు సర్కార్ ఫైనల్ వార్నింగ్- కరోనా వైద్యం నిరాకరిస్తే కఠిన చర్యలే...
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ రోగులను పరీక్షించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరిస్తున్న ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. కరోనా రోగులకు చికిత్స చేస్తే తమ ఆస్పత్రిలో ఇతరులకు కూడా వైరస్ సోకుతుందన్న భయంతో వీరు రోగులను వెనక్కి పంపుతున్నారు. మానవత్వం లేకుండా ఆస్పత్రులు ఇలా ప్రవర్తిస్తుండటాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోంది.
ఏపీలో కొత్తగా 7948 కరోనా కేసులు, 58 మంది మృతి... హాట్ స్పాట్లుగా తూర్పుగోదావరి, కర్నూలు
ఇకపై కరోనా వైద్యం నిరాకరించే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని సర్కారు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా రోగులను పరీక్షించకుండా వెనక్కి పంపితే లైసెన్స్ ల రద్దుతో పాటు ఇతర చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యమంత్రి ఆళ్లనాని హెచ్చరించారు.
రాజమండ్రి కార్పోరేషన్ కార్యాలయంలో కోవిడ్ పై సమీక్ష నిర్వహించిన ఆళ్లనాని.. ఇకపై కరోనా పరీక్షల ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కరోనా పరీక్షల్లో ఇప్పటికే దేశంలో అగ్రస్ధానంలో ఉన్నామని, త్వరలో 17 వేల మంది అదనపు వైద్య సిబ్బందిని నియమించేందుకు సిద్దమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇలాంటి పరిస్దితుల్లో ప్రైవేటు ఆస్పత్రులు, ప్రజల సహకారాన్ని కోరుతున్నట్లు మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. ప్రజల నుంచి సహకారం లభించకపోతే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండదని మంత్రి తెలిపారు.