ఏపీ సచివాలయం, అసెంబ్లీలో కరోనా కల్లోలం- 138కి చేరిన కేసులు- గేట్ల మూసివేత
ఏపీ సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణాల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కరోనా ప్రభావం కనిపిస్తున్నప్పటికీ ఉద్యోగులతో పనిచేయించేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతుండటంతో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే 19 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 138కి చేరిపోయింది. దీంతో ఉద్యోగులు సచివాలయానికి రావాలంటేనే భయపడుతున్నారు. సందర్శకులతో పాటు మంత్రుల రాక కూడా తగ్గిపోయింది. చివరికి భద్రతా కారణాలతో ఇవాళ సచివాలయం, అసెంబ్లీ ఎంట్రీ గేట్లను కూడా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అసెంబ్లీ, సెక్రటేరియట్లో కరోనా...
ఏపీ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా మహమ్మారి రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయంతో పాటు అసెంబ్లీని కూడా వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, సందర్శకుల రాకను నియంత్రించినా ఫలితం లేకుండా పోతోంది. అన్లాక్ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులను గతంలో కంటే ఎక్కువగానే విధులకు రప్పిస్తున్నారు. దీంతో ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నిన్న ఒక్కరోజే 19 కేసులు రావడంతో అధికారులు, ఉద్యోగులు అవాక్కయ్యారు. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ ఇరు ప్రాంగణాల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 138కి చేరింది.

ఉద్యోగుల బెంబేలు...
కరోనా వ్యాప్తి తగ్గకపోవడం, అయినా విధుల్లోకి రావాల్సిందేనన్న ఒత్తిళ్లతో ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైన కొత్తలో ప్రభుత్వం అత్యవసర విధుల్లో ఉండాల్సిన ఉద్యోగులు మాత్రమే రావాలని, మిగతా వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని సూచించింది. అయితే పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఉద్యోగులు సచివాలయం, అసెంబ్లీకి రాక తప్పని పరిస్ధితి. వీరంతా విజయవాడ, గుంటూరు చుట్టు పక్కల ప్రాంతాల నుంచే ఇక్కడికి వస్తుంటారు. ప్రస్తుతం రవాణా సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రజారవాణా ఇంకా పూర్తిగా ప్రారంభం కాలేదు. దీంతో అందుబాటులో ఉన్నవాహనాల్లోనే సచివాలయానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో వీరు వైరస్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.

సచివాలయం, అశెంబ్లీ గేట్ల మూసివేత...
కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు ఇవాళ సచివాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం గేట్ 1, అసెంబ్లీకి వెళ్లే ప్రధాన ద్వారం గేట్ 2నూ మూసివేశారు. ఇతర ద్వారా ఎప్పటి నుంచో మూసివేసే ఉన్నాయి. ఇప్పుడు ప్రధాన ద్వారాలు సైతం మూసివేయడంతో సాధారణ రాకపోకలు కూడా నిలిచిపోయినట్లయింది. కేవలం అత్యవసర విధుల్లో ఉన్న ఉద్యోగులకు మాత్రమే ప్రత్యేక అనుమతులతో వారి బ్లాకుల్లోకి అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు, ఉన్నతాధికారులు కూడా రావడం తగ్గించేయడంతో పరిస్ధితిని బట్టి వీటిని తిరిగి తెరిచే అవకాశముంది.

కనిపించని జాగ్రత్తలు...
కీలకమైన సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణాల్లో పదుల సంఖ్యలో ఆఫీసులు ఉంటాయి. వందల సంఖ్యలో ఉద్యోగులు ఉంటారు. వీరు నిరంతరం విధి నిర్వహణలో భాగంగా ఆయా ప్రాంగణాల్లో తిరుగుతూ ఉంటారు. వీరితో పాటు అత్యవసర పనుల కోసం వచ్చే సందర్శకులు కూడా ఉంటారు. వీరిలో ఎవరికి వైరస్ సోకిందో ఎవరికీ తెలియదు. ప్రభుత్వం మొదట్లో శానిటైజర్లు, మాస్కులను అందుబాటులో ఉంచింది. కానీ కరోనా వ్యాప్తి పీక్లో ఉన్న ఇలాంటి సమయంలో మాత్రం శానిటైజేషన్ కానీ శానిటైజర్లను అందుబాటులో ఉంచడం కానీ తగ్గించేసింది. దీంతో ఉద్యోగులు సెలవు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులపై ఒత్తిళ్లు పెంచుతున్నారు.












Click it and Unblock the Notifications