పవన్ కల్యాణ్ వెనకడుగు వేసిన వేళ - బీజేపీ రూటు మారింది: మనసు కూడా?
విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన బస్సు యాత్ర వాయిదా పడిన వేళ.. మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ తెర మీదికి వచ్చింది. పవన్ స్థానంలో తాను బస్సు యాత్రను చేపట్టింది. జనవాణిలో వచ్చిన విజ్ఞప్తులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందిన ఫిర్యాదులపై అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో బస్సు యాత్రను వాయిదా వేసుకుంది జనసేన. దీని తరువాత రోడ్డెక్కుతామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

జనసేన యాత్ర వాయిదాతో..
షెడ్యూల్ ప్రకారం- వచ్చే అక్టోబర్లో జనసేన పార్టీ బస్సు యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుందా పార్టీ అగ్ర నాయకత్వం. తిరుపతి నుంచి దీన్ని ప్రారంభించేలా రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసుకుంది. ఇప్పుడు దీన్ని వాయిదా వేసుకుంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతే జనంలోకి వెళ్తామని పేర్కొంది. కౌలు రైతుల సమస్యలపై చేస్తోన్న పర్యటనలు ఇంకా పెండింగ్లో ఉన్నందున వాటిని పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది.
రోడ్డెక్కిన బీజేపీ..
ఈ పరిస్థితుల మధ్య జనసేన మిత్రపక్షం బీజేపీ తాజాగా రోడ్డెక్కింది. ప్రజా పోరు యాత్రను చేపట్టింది. ఈ ఉదయం ఈ యాత్రను పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు జెండా ఊపి ప్రారంభించారు. 15 రోజుల పాటు ఇది కొనసాగుతుంది. అక్టోబర్ 2వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున భారీ బహిరంగ సభతో దీనికి ముగింపు పలకనున్నారు బీజేపీ నాయకులు.

2024 ఎన్నికలే లక్ష్యంగా..
ఈ యాత్ర ద్వారా ప్రజలను జాగృతం చేయడం, 2024 నాటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రజా పోరు యాత్రను చేపట్టారు కమలనాథులు. ఈ 15 రోజుల పాటు నగరాలు, పట్టణాలు, గ్రామస్థాయిలో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఈ సభలకు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకుంటోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

అయిదు వేలకు పైగా..
ఈ 15 రోజుల పాటు సుమారు 5,000లకు పైగా బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలను రూపొందించుకుంది బీజేపీ. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ రెండు సంవత్సరాల పాటు నిత్యం ప్రజల్లో ఉండేలా భవిష్యత్ కార్యాచారణ ప్రణాళికలను రూపొందించుకున్నారు. వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై పట్టు పెంచుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది.












Click it and Unblock the Notifications