సోషల్ మీడియాలో బెజవాడ కనకదుర్గమ్మ మూలవిరాట్, అంతరాలయ వీడియోలు.. కొత్త వివాదం!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బెజవాడ కనకదుర్గమ్మ గుడి మరో వివాదంలో చిక్కుకుంది. గతంలోనే కనకదుర్గమ్మ గుడిలోని అమ్మవారి ఉత్సవాల్లో వినియోగించే వెండి రథంలో సింహాలు మాయమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి పెద్ద రాజకీయ వివాదంగా మారగా, తాజాగా మరో ఘటన విజయవాడ దుర్గ గుడిని వార్తల్లో నిలిచింది. ఆలయంలో భద్రతా లోపంపై చర్చకు కారణమైంది. ఇంతకు ఏం జరిగిందంటే
కనకదుర్గ అమ్మవారి మూలవిరాట్ వీడియో వైరల్
రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు విశ్వసించే పరమ పవిత్రమైన కనకదుర్గ అమ్మవారి గుడిలో గర్భాలయాన్ని, అమ్మవారి మూలవిరాట్ ను భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా ఆలయ అధికారులు ఉలిక్కిపడ్డారు. కనకదుర్గ ఆలయం లోనికి సెల్ ఫోన్లు తీసుకువెళ్లడం నిషేధం. ఆలయం క్రిందనే మొబైల్ ఫోన్లను భద్రపరచడానికి ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.
ఆలయంలో సెల్ ఫోన్లు నిషేధం .. అయినా ఫోన్ తీసుకెళ్ళి వీడియోలు
ఇక భక్తులు ఆలయంలోకి వెళ్ళే సమయంలో కూడా లోపలికి వెళ్లే క్రమంలో ప్రతిచోటా తనిఖీలు చేసిన తర్వాతనే భక్తులను లోనికి అనుమతినిస్తారు. అంతగా భద్రత ఉండే కనకదుర్గ ఆలయంలో లోపలికి సెల్ ఫోన్ ను తీసుకువెళ్ళడమే కాకుండా, చక్కగా అమ్మవారి మూలవిరాట్ ను కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అమ్మవారి మూలవిరాట్ ను వీడియో తీయడం పై కనకదుర్గ ఆలయ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు గా మారాయి.
సెల్ ఫోన్ తో వీడియో తీస్తుంటే సిబ్బంది ఏం చేస్తున్నారు?
భక్తులు ఆలయంలోకి సెల్ ఫోన్ ఏ విధంగా తీసుకువెళ్లారు? సెక్యూరిటీ సిబ్బంది సెల్ఫోన్ తీసుకువెళ్లి వీడియో తీస్తున్నా పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు? ఇక సీసీ కెమెరాలను నిత్యం పర్యవేక్షించే క్రమంలో అక్కడి సిబ్బంది ఏం చేస్తున్నారు? వంటి అనేక అనుమానాలు అమ్మవారి మూలవిరాట్ వీడియో వైరల్ కావడంతో ఉత్పన్నమవుతున్నాయి. దీంతో బయట విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అలర్ట్ అయిన ఆలయ అధికారులు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించారు.
పోలీసులకు ఫిర్యాదు .. విచారణకు ఆదేశం
అయితే డిసెంబర్ 22వ తేదీన ఒక మహిళ అమ్మవారి అంతరాలయాన్ని వీడియో తీసినట్లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సెక్యూరిటీ సిబ్బందికి నోటీసులు జారీ చేయడంతో పాటు, ఈవో భ్రమరాంబ దీనిపై విచారణకు ఆదేశించారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరించిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.