నీ వాత్సల్యం ఆదర్శం.. శునకానికి కాంస్య విగ్రహాం, వర్ధంతి..
జంతువులంటే కొందరికీ చాలా ప్రేమ. వాటిని కంటికి రెప్పలా చూసుకుంటారు. ఏమైనా జరిగితే సొంతవాళ్లకు జరిగినట్టు ఫీలవుతుంటారు. అవి తిరిగి ఆరోగ్యంగా అయ్యేంత వరకు ఆందోళన చెందుతుంటారు. జంతువులు చనిపోయిన సమయంలో వాటితో సన్నిహితంగా ఉన్న వారు పడే బాధ వర్ణనాతీతం. కన్నీళ్లు కారుస్తూ..వాటి అంత్యక్రియలను ఘనంగా నిర్వహిస్తుంటారు కూడా.
మరికొందరు వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఒకరు మాత్రం తన పెంపుడు జంతువుకు ఏకంగా కాంస్య విగ్రహం పెట్టించారు. అంతేకాదు వర్ధంతి రోజున పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఏపీలో గల కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో ఘటన జరిగింది. సుంకర జ్ఞానప్రకాశ రావు ఓ శునకం పెంచుకుంటున్నారు. ఇతనికి ఆ కుక్క అంటే ఎంతో ప్రేమ. దానికి 'శునకరాజు' అని పేరు కూడా పెట్టారు.
కుటుంబసభ్యుల కంటే ఎక్కువగా చూసుకున్నారు. కొంతకాలం తర్వాత ఆ శునకరాజు చనిపోయింది. లోకం విడిచి వెళ్లిపోయినా.. దాని జ్ఞాపకాల్లో జీవిస్తున్నారు. ప్రతి ఏటా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కుక్క జ్ఞాపకాలను మరిచిపోలేని జ్ఞానప్రకాశ రావు దానికి కాంస్య విగ్రహం చేయించారు. ఇటీవలే 5వ వర్ధంతి జరిగింది. కాంస్య విగ్రహానికి శాస్త్రీయబద్ధంగా పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. శునకం విగ్రహానికి పూలతో అలంకరించి..పిండ ప్రధానం చేయడం విశేషం.
స్థానికులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. శునకరాజు ఆత్మకు శాంతి కలుగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ...ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. పెంపుడు కుక్కపై ఇంత ప్రేమనా అంటూ ఒకింత ఆశ్చర్యపోతున్నారు.