గోరంట్ల ఇష్యూపై సజ్జల కామెంట్స్: బుద్దా వెంకన్న, అనిత నిప్పులు..
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో చుట్టూ తిరుగుతుంది. అయితే కాసేపటి క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చాడు. ఓటుకు నోటు కేసు గురించి ప్రస్తావించారు. ఆ కేసు ఏళ్లుగా సాగుతోందని చెప్పారు. అయినప్పటికీ మాధవ్ దోషి అని తేలితే చర్యలు తప్పవని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి పేరు కూడా తీశారు. దీనిపై టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, వంగలపూడి అనిత కూడా కౌంటర్ అటాక్ ఇచ్చారు.
ఫిర్యాదు చేస్తేనే..?
సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్పై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో ఇంతవరకు ఎవరు ఫిర్యాదు చేయలేదని, ఏ మహిళ అయినా ఫిర్యాదు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సజ్జల అన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న మండిపడ్డారు.
ఫిర్యాదు చేస్తేనే మహిళలకు న్యాయం చేస్తాం అనడం దారుణమని విమర్శించారు. బుల్లెట్ కంటే ముందొస్తాడు అంటూ ఎలివేషన్లు ఎందుకు? అంటూ ఎత్తిపొడిచారు. మహిళల్ని దగా చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ బుద్ధా ట్వీట్ చేశారు. సజ్జల వ్యాఖ్యల క్లిప్పింగ్ను కూడా పంచుకున్నారు.
Recommended Video
చర్యలు ఉండవు.. అర్థమైంది..
టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. గంట, అరగంట అశ్లీల వీడియోలు బయటికి వచ్చాయని, అవి నిజం అని అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఆ వీడియోలు తమవి కాదని వాళ్లే చెప్పారంట... అందుకే అవి వారివి కాదు అని ఇతగాడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. వాళ్లు రోత అయితే ఇతడు మహారోతలా ఉన్నాడు. మొత్తానికి డర్టీ ఎంపీ మాధవ్ పై చర్యలేమీ ఉండవు అని పరోక్షంగా చెప్పేశారని అనిత ధ్వజమెత్తారు.
మార్పింగ్ కాదు..?
అంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే మాధవ్పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ వీడియో ఒరిజనలో, కాదో తెలుసుకోవడానికి అరగంటో, గంటో చాలని అంటున్నారని గుర్తుచేశారు. మరీ ఆనాడు చంద్రబాబునాయుడు పక్కా ఆధారాలతో దొరికిన ఓటుకు నోటు వ్యవహారమే ఇప్పటికీ తేలలేదని సజ్జల అన్నారు.