ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం మరో క్లారిటీ- అంతా వారి చేతుల్లోనే-ఆర్టీఐకి జవాబు
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే మూడు రాజధానుల పిటిషన్లు హైకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో హైకోర్టు తరలింపుపై కేంద్రం వద్ద కూడా జగన్ సర్కార్ లాబీయింగ్ చేపట్టింది. అయితే గతంలో ఓసారి హైకోర్టు తరలింపుపై పార్లమెంటు వేదికగానే స్పష్టత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చేసింది. దీంతో హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సి ఉంది.
ఏపీ హైకోర్టు తరలింపు వ్యవహారం
ఏపీ సర్కార్ మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కర్నూలుకు హైకోర్టును తరలించాలని నిర్ణయించింది. కర్నూలులోని జగన్నాధగట్టు వద్ద 250 ఎకరాల్లో న్యాయ రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ఇప్పటికే స్పష్టత ఇచ్చేశారు.. అయితే ఈ తరలింపు ఎప్పుడు ఉంటుంది, కొత్త హైకోర్టు నిర్మాణం ఎప్పుడు ప్రారంభం కానుందన్న అంశంపై మాత్రం స్పష్టత రావడం లేదు. దీనికి కారణం హైకోర్టులో పెండింగ్లో ఉన్న మూడు రాజధానుల కేసులే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందడుగు వేయలేని పరిస్ధితి.
హైకోర్టు తరలింపుపై కేంద్రం క్లారిటీ
ఏపీ హైకోర్టు ఎప్పుడు అమరావతి నుంచి కర్నూలుకు తరలిస్తున్నారన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పలేని పరిస్ధితుల్లో ఉంది. హైకోర్టులో పెండింగ్లో ఉన్న మూడు రాజధానుల కేసుల విచారణ పూర్తయితే కానీ దీనిపై నిర్ణయం తీసుకోలేని పరిస్ధితి. అయితే ఇందులో కేంద్రం పాత్రపై ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి. దీంతో పార్లమెంటులో గతంలో మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఇదే విషయమై ప్రశ్నించినప్పుడు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఆర్టీఐ ద్వారా దాఖలైన పిటిషన్కూ కేంద్ర న్యాయశాఖమంత్రి మరోసారి క్లారిటీ ఇచ్చారు.
అంతా హైకోర్టు, జగన్ సర్కార్ చేతుల్లోనే
ఏపీ హైకోర్టు తరలింపు వ్యవహారంలో కేంద్రం పాత్రమే లేదని, హైకోర్టు, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కలిసి మాట్లాడుకుని దీనిపై నిర్ణయం తీసుకోవడమే మిగిలుందని తాజాగా సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్కు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానం ఇచ్చారు. గతంలో పార్లమెంటు వేదికగా కూడా కేంద్రం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపే పరిస్ధితి ఇప్పుడు ఉందా అంటే మాత్రం ఎవరి దగ్గరా సమాధానం రావడం లేదు.
మూడు రాజధానుల పిటిషన్లు తేలాకే
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణకు హైకోర్టు తాజాగా మే 3ను తేదీగా నిర్ణయించింది. మే 3న ప్రారంభమయ్యే విచారణ కనీసం రెండు, మూడు నెలల పాటు సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ పిటిషన్ల వ్యవహారం తేలాకే హైకోర్టు తరలింపుపై హైకోర్టు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందడుగు వేసే అవకాశం దక్కుతుంది. ఈ పిటిషన్లు తేలకుండా హైకోర్టు కూడా ముందుకొచ్చే పరిస్ధితి లేదు. అందుకే వైసీపీ సర్కారు కూడా ఈ పిటిషన్లపై హైకోర్టు ఇచ్చే తీర్పు కోసం ఎదురుచూస్తోంది.