మీ జాగీరా? చరిత్రహీనులవుతారు: ఏపీ సీఎం జగన్పై చంద్రబాబు తీవ్ర విమర్శలు
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, చంద్రబాబు నాయుడు సీఎం జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్ ఫేక్ ముఖ్యమంత్రని, పూర్తి అసహనంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
జీరో సీఎం జగన్..
శాననసభను వాయిదా వేయడం సరికాదన్నారు. జగన్ ప్రభుత్వం అసెంబ్లీ పవిత్రతను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రికి ఉండాల్సిన అర్హతలు లేవని దుయ్యబట్టారు. ఎలాంటి అవగాహన లేని జీరో సీఎం అంటూ జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. గాలి మాటలు మాట్లాడటం, ఎదురుదాడి చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు.
అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు..
అసెంబ్లీలో అడ్డగోలుగా వ్యవహరిస్తూ విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఫేక్ మీడియాతో ఫేక్ వార్తలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పింఛన్లను భారీగా తగ్గించిందని, ఈ విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు. టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తలకు పూర్తిగా పింఛన్లు తొలగించారని అన్నారు.
ప్రజలను మోసం చేస్తున్నారు..
ఏటా పింఛన్లను పెంచుకుంటూ వెళ్తామని చెప్పిన జగన్ పార్టీ.. ఈ ఏడాది ఇవ్వాల్సిన పింఛనును వచ్చే ఏడాది ఇస్తామంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో పింఛన్లపై టీడీపీ నేతలకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. తప్పుడు సమాచారం చెబుతూ అసెంబ్లీని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు.
మీ జాగీరా? చరిత్రహీనులుగా మిగిలిపోతారు..
అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీ ఏమైనా వారి జాగీరా? ప్రజస్వామ్యంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా ఉన్నానని చంద్రబాబు చెప్పారు. జగన్ మాత్రం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు జగన్ తీరును అర్థం చేసుకోవాలన్నారు.