YS Jagan Mohan Reddy: మూడు జీవోలతో ముప్పేట దాడి: జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి..!
Recommended Video
అమరావతి: మూడు జీవోలు..మూడే మూడు జీవోలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ముప్పేట దాడికి తెర తీశాయి. ప్రభుత్వంపై ఘాటు విమర్శలను సంధించడానికి కారణాలయ్యాయి. ప్రతి అంశానికీ వివరణ ఇచ్చుకునేలా చేశాయి. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడేలా చేశాయి. మీడియాపై ఆంక్షలను విధించడం, ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరును తొలగించడం, ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహారం. ఈ మూడింట్లో ఒక్క జీవో విషయంలో మాత్రమే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయినప్పటికీ.. జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతోంది.

మీడియాపై ఆంక్షలు విధిస్తూ..
మీడియాపై ఆంక్షలను విధిస్తూ జారీ చేసిన జీవో ప్రకంపనలను రేపింది. మీడియాను నియంత్రించేలా ఈ జీవోను ప్రభుత్వం జారీ చేసిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. నియంతృత్వ ధోరణికి దారి తీసిందంటూ ఆరోపణలు ప్రభుత్వ పెద్దలను చుట్టుముట్టాయి. కొన్ని చోట్ల మంత్రుల విలేకరుల సమావేశాలను సైతం మీడియా ప్రతినిధులు బహిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. మంత్రుల సమక్షంలో తమ నిరసనను వ్యక్తం చేసిన సంఘటనలు లేకపోలేదు. దీనిపై మంత్రులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవాస్తవ, నిరాధార కథనాలను నియంత్రించాలనే ఉద్దేశంతోనే ఈ జీవోను విడుదల చేశామంటూ మంత్రులు.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకోవాల్సి వచ్చింది.

అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలకు వైఎస్సార్ పేరు..
మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీద ఏటా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేస్తోంది ప్రభుత్వం. అబ్దుల్ కలాం పేరును మార్చి.. డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడం వివాదాలకు దారి తీసింది. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం పేరును తొలగించడం పట్ల ఏ స్థాయిలో విమర్శలు చెలరేగాయో తెలిసిన విషయమే. తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. కొందరు మేధావులు సైతం తప్పు పట్టారు. విద్యార్థల నుంచీ వ్యతిరేకత ఎదురైంది.

ముఖ్యమంత్రికి తెలియకుండానే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిసి జరిగిందో.. తెలియక జరిగిందో తెలియట్లేదు గానీ.. అప్పటికప్పుడు డ్యామేజ్ కంట్రోల్ దిగారాయన. వైఎస్సార్ పేరును తొలగించి అబ్దుల్ కలాం పేరును పునరుద్ధరిస్తూ మరో జీవో విడుదల అయ్యేలా నష్ట నివారణ చర్యలు చేపట్టారు. వైఎస్ జగన్ పరిపాలనపై, అధికారులపై, తన మంత్రివర్గ సహచరులపైనా పట్టు లేదనే విషయం ఈ జీవోతో స్పష్టమైందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు గుప్పించారు. ఉద్దేశపూరకంగానే ఆయన ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్య బదిలీ వ్యవహారానికి సంబంధించిన జీవో కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాడానికి ప్రతిపక్షాలు అవకాశాలను కల్పించింది. టీడీపీ, బీజేపీ నాయకులు ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీని తప్పు పట్టారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఆయనను అత్యున్నత పదవి నుంచి తప్పించి, ప్రాధాన్యత లేని విభాగానికి బదిలీ చేస్తూ జీవో విడుదల చేయడం పట్ల పట్ల బ్రాహ్మణ సామాజిక వర్గంలో అసంతృప్తి దారి తీసింది. దీన్ని అదుపు చేయడానికి వైఎస్ జగన్.. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులకు శ్రీవారి ఆలయంలో ఎంట్రీ ఇప్పించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications