ప్రపంచంలోనే పవర్ఫుల్ ఆయుధం - మన బతుకుల్ని మార్చేది అదే - స్కూల్ పిల్లాడిలా సీఎం జగన్
చదువుల రంగంలో అవసరమైన మార్పుల గురించి ఇప్పటికే టన్నులకొద్దీ ప్రతిపాదనలు ఉన్నాయి. ఎటొచ్చీ, వాటిలో కొన్నింటినైనా అమలు చేయాలనే సంకల్ప లోపమే ఇన్నాళ్లూ పేదల పాలిటి శాపంగా ఉండింది. ఇప్పటికిగానీ, ఆ లోటును పూడ్చుతూ, డబ్బున్న పెద్దింటి బిడ్డల మాదిరిగానే పేదింటి పిల్లలూ గర్వంగా తలెత్తుకుని ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లగలిగే ఏర్పాటును జగన్ సర్కారు అమలులోకి తెచ్చింది. నాడు నేడు పేరుతో ప్రభుత్వ స్కూళ్ల స్వరూపాన్ని సమూలంగా మార్చేసిన వైసీపీ సర్కారు.. ఆ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఏడు రకాల వస్తువులతో కూడిన 'జగనన్న విద్యా కానుక' పథకాన్ని సైతం గురువారం ప్రారంభించింది.
Recommended Video

పునాదిపాడులో సీఎం సభ..
కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో స్కూళ్ల రీఓపెనింగ్ పై దృష్టిసారించిన ఏపీ సర్కారు.. బడుల పున:ప్రారంభానికి ముందే విద్యార్థులందరికీ ‘జగనన్న విద్యా కానుక' అందజేయనుంది. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ పథకాన్ని సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో ఏర్పాటు చేసిన సభలో పథకానికి శ్రీకారం చుట్టిన ఆయన.. నెల్సన్ మండేలా, మలాలా యూసఫ్ చెప్పిన విషయాలను గుర్తుచేస్తూ, విద్యావ్యవస్థలో మార్పులపై స్ఫూర్తిమంతమైన ప్రసంగం చేశారు. పిల్లలకు కిట్స్ పంచిన సీఎం.. తానూ స్కూల్ పిల్లాడిగా బ్యాగు వేసుకుని ఆనందించారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

విద్యతోనే ప్రపంచంలో మార్పు..
‘‘నోబెల్ పురస్కార గ్రహీత మలాల యూసఫ్ జాయ్ ఒక మాట చెబుతారు.. ‘‘వన్ చైల్డ్ - వన్ టీచర్ - వన్ పెన్ - వన్ బుక్ - కెన్ ఛేంజ్ ద వరల్డ్''అని. అలాగే, అత్యంత శక్తిమంతమైన ఆయుధం విద్య అని, దానితోనే ప్రపంచాన్ని మార్చగలమని దివంగత నెల్సన్ మండేలా చెప్పేవారు. ఏపీలోని పిల్లలందరూ ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి రావాలి. ప్రపంచాన్ని జయించే స్థాయికి మన పేద పిల్లలు ఎదగాలి. అది జరగాలంటే చదువుల రంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. అలా కోరుతున్నాం కాబట్టే ‘ప్రపంచాన్ని మార్చేసే శక్తి చదువుకు ఉంది'అని గుర్తుచేస్తున్నాను.

వెనుకబాటును తొలగించే ఆస్తి
చదువుల రంగం గురించి మాట్లాడేముందు.. అసలు చదువుకునే శక్తిలేని పేద ప్రజల గురించి మనం ఎంత నిజాయితీగా ఆలోచించామన్నది మననం చేసుకోవాలి. ఈ లోకంలో చదువుకోవద్దని ఎవరూ అనుకోరు. ప్రతి తల్లిదండ్రీ తమ పిల్లల్ని గొప్పగా చదివించాలనే ఆశపడతారు. అయినాకూడా, తల్లులు తమ బిడ్డల్ని ఎందుకు బడికి పంపలేక పోతున్నారో ఆలోచించి, దానికి పరిష్కారాలుగా కొత్త కార్యక్రమాలను చేపట్టాం. ఎందుకంటే ఎవరికైనా చదువే తరగని ఆస్తి.. చదువే దొంగలు కొల్లగొట్టలేని ఆస్తి.. చదువే తరతరాల వెనుకబాటును తీసేసే ఆస్తి.. చదువే మన బతుకుల్ని మార్చేసే ఆస్తి.

స్వాతంత్ర్యం తరువాత విప్లవాత్మక మార్పు ఇది..
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 73 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఏపీలో 34 శాతం మంది చదువురాని పరిస్థితిలో ఉన్నారంటే దానికి కారణమేంటి? మార్పు కోసం గత పాలకులెవరూ ఆలోచన చేయలేదు కాబట్టే ఈ పరిస్థితి నెలకొంది. ఇంగ్లీష్ చదువులు ఖరీదైన వ్యవహారంగా మారిన వేళ.. తల్లిదండ్రుల ఆర్థిక, సామాజిక పరిస్థితులే పిల్లల చదువులను నిర్ణయిస్తున్నాయి. ఇవన్నీ మారినప్పుడే మెరుగైన విద్యా వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టే అంగన్ వాడీల దగ్గర్నుంచి ఉన్నత విద్య స్థాయి వరకు చదువుల రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టామని సగర్వంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఇవాళ విద్యా కానుక పథకాన్ని ప్రారంభిస్తున్నాం..

పిల్లలకు కావాల్సినవన్నీ ఇస్తున్నాం..
మన బడి, నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖల్ని సమూలంగా మార్చేశాం. నీటి సదుపాయం ఉన్న టాయిలెట్లు, కరెంటు సదుపాయం ఉండే ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఉన్న క్లాస్ రూములు, మంచి తాగునీరు, చక్కటి బోర్డులు, పిల్లలు, టీచర్లు కూర్చోడానికి చక్కటి ఫర్నీచర్, స్కూళ్లను బాగు చేయడంతోపాటు అక్కడ అహ్లాదకరమైన వాతావరణం, ప్రొటెక్షన్ కోసం కాంపౌండ్ వాల్.. పిల్లలకు పౌష్టికాహారం అందించే గోరుముద్ద పథకం.. ఇలా విద్యార్థి ఎందులోనూ తీసిపోని విధంగా ప్రతి గ్రామంలో, పిల్లలకు కావాల్సినవన్నీ ఇస్తున్నాం. పెద్ద బడులకు వెళ్లే పిల్లల మాదిరిగానే ప్రభుత్వ బడులకు వెళ్లే పేదలు గర్వంగా తలెత్తుకుని వెళ్లేలా యూనిఫాం, షూస్, బ్యాగ్, టై, బెల్టు, టెక్స్ట్, వర్కు బుక్స్ ఇస్తున్నాం. అంతేకాదు..

ఒక్క విద్యా రంగంలోనే 8 పథకాలు..
నవంబర్ 2 నుంచి బడులు తెరవాలనుకుంటున్నాం. ఆలోపే విద్యా కానుక కిట్స్.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 44.32 లక్షల మంది విద్యార్థులకు అందజేస్తాం. దీని కోసం రూ.650 కోట్ల ఖర్చు వెచ్చించాం. అంగన్ వాడీల నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలన్నదే నా సంకల్పం. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనవాళ్లు ఎదిగితే, ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలు పోటీపడే పరిస్థితి వస్తుంది.పేదపిల్లల తలరాతలు మార్చాలని కేవలం విద్యా రంగంలోనే 8 ప్రధాన పథకాలు అమలు చేస్తున్నాం. అమ్మఒడి పథకం ద్వారా రూ.15 వేలను ప్రతి తల్లి అకౌంట్లో వేస్తున్నాం. పదేళ్ల తర్వాత ప్రపంచంలో గొప్ప మార్పులకు సారధులుగా మన పిల్లలు నిలవాలన్నదే మా సంకల్పం. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన పెద్ద కులాల వాళ్లు ముందుకు వెళ్లాలనే ఈ పథకాలను అమలు చేస్తున్నాం. ఇవన్నీ విజయవంతం కావాలని కోరుతున్నా..'' అంటూ సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications