వైఎస్సార్ బీమా ప్రారంభించిన జగన్- ఏటా రూ.510 కోట్లతో కోటీ 41 లక్షల కుటుంబాలకు లబ్ది
ఏపీలో వైఎస్సార్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రారంభించింది. ఎన్నికల హామీ మేరకు సహజ మరణాలతో పాటు ప్రమాదాల్లో అంగవైకల్యం ఏర్పడిన వారికి బీమా సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్నిరూపొందించింది. ఏటా రూ.510 కోట్ల రూపాయలతో కోటీ 41 లక్షల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు దీని వల్ల బీమా సాయం అందబోతోంది. పేదల బీమా పథకం నుంచి కేంద్రం తప్పుకున్నా రాష్ట్ర ప్రభుత్వమే వైఎస్సార్ బీమా రూపంలో దీన్ని అమలు చేస్తుందని సీఎం జగన్ పథకం ప్రారంభం సందర్భంగా ప్రకటించారు.

వైఎస్సార్ బీమా ప్రారంభం..
ఏపీలో పేద కుటుంబాల్లో మరణాలు, ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు వారికి భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన వైఎస్సార్ బీమా పథకం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా సహజ మరణాలు చోటు చేసుకున్నప్పుడు కూడా పేద కుటుంబాలకు సాయం చేసేలా దీన్ని రూపొందించారు. వైసీపీ ఎన్నికల హామీల్లో ఒకటైన ఈ పథకాన్ని సీఎం జగన్ ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి దీన్ని ప్రారంభించారు. ఒకే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ ఈ పథకం ప్రారంభించారు. రూ.510 కోట్ల రూపాయల ఖర్చుతో అమలయ్యే ఈ పథకం ద్వారా రాష్ట్రంలో బియ్యం కార్డులున్న కోటీ 41 లక్షల కుటుంబాలకు లబ్ది కలగనుంది.

వైఎస్సార్ బీమా వర్తింపు ఇలా...
వైఎస్సార్ బీమా వర్తింపు కోసం పేదలు, బాధితులను మొత్తం నాలుగు వర్గాలుగా విభజించారు. ఇందులో 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న వారు సహజమరణం పాలైతే వారికి 2 లక్షల రూపాయల బీమా అందబోతోంది. అలాగే ప్రమాదాల్లో మరణం సంభవించినా లేదా శాశ్వత అంగవైకల్యం చోటు చేసుకున్నా 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న వారికి 5 లక్షల రూపాయలు, 51 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న వారికి 3 లక్షల రూపాయల బీమా అందనుంది. అలాగే పాక్షిక అంగవైకల్యం ఏర్పడిన వారికి 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్న బాధితులకు లక్షా 50 వేల రూపాయలు బీమా సాయంగా అందుతుంది.

కేంద్రం సాయం లేకపోయినా...
గతంలో కేంద్ర ప్రభుత్వ వాటాతో ఏపీలో పేదలకు బీమా పథకం అమలయ్యేది. పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై పథకాల కింద ప్రతీ పాలసీకి కేంద్ర ప్రభుత్వం 50 శాతం వాటా ఇచ్చేంది. కానీ కేంద్రం నుంచి బీమా సాయం లభించడం ఆగిపోయాక పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇందులో పలుమార్పులు చేసి అమలు చేస్తున్నారు. కేంద్రం సాయం లేకపోయినా ఎన్నికల హామీ మేరకు దీన్ని అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వైఎస్సార్ బీమా కార్డు ఉన్న కుటుంబంలో ఎవరైనా మరణిస్తే క్లెయిమ్ వచ్చే వరకూ ఎదురుచూడకుండా అంత్యక్రియల కోసం రూ.10 వేల రూపాయలు గ్రామ సచివాలయాల ద్వారా ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.
Recommended Video

వైఎస్సార్ బీమా దరఖాస్తు ఇలా...
వైఎస్సార్ బీమా పథకంలో భాగంగా రాష్ట్రంలోని కోటీ 41 లక్షల బియ్యం కార్డు కలిగిన కుటుంబాలకు అర్హత కల్పించారు. గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా లబ్ది దారులకు బ్యాంకు ఖాతాలు తెరవడం, బీమా ప్రాసెసింగ్, క్లెయిమ్ చెల్లింపు సాయం అందనుంది. వాలంటీర్ల సాయంతో దరఖాస్తులు స్వీకరించడమే కాకుండా వారం రోజుల్లోనే బీమా కార్డులు లబ్ది దారులకు అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రమాదాలు లేదా మరణాలు సంభవించినప్పుడు క్లెయిమ్ చేసిన 15 రోజుల్లో లబ్ది దారులకు బీమా సాయం అందేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బియ్యం కార్డు దారులుగా ఉన్న వారితో పాటు కొత్తగా బియ్యం కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికీ ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. బీమా నమోదు, క్లెయిమ్ చెల్లింపుల్లో ఫిర్యాదుల కోసం 155214 టోల్ఫ్రీ నంబరును కూడా అందుబాటులోకి తెచ్చారు.












Click it and Unblock the Notifications