హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలుపు: బెజవాడ దుర్గమ్మకు 101 కొబ్బరికాయలు
హైదరాబాద్/విజయవాడ: తెలంగాణలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు టీఆర్ఎస్ అభిమాని కొణిజేటి ఆదినారాయణ.
హుజూర్నగర్ బరిలో 251 మంది సర్పంచ్లు: అదే బాటలో లాయర్లు: ఏ పార్టీకి నష్టం..!
హుజూర్నగర్ ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపొందినందుకు దుర్గమ్మ గుడిలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నట్లు ఆదినారాయణ తెలిపారు. సైదిరెడ్డిని గెలిపించిన హుజూర్నగర్ ప్రజలకు, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజయవాడ దుర్గమ్మను కోరుకుంటానని ఆదినారాయణ తెలిపారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు.
తెలంగాణ ప్రజలకు, కేసీఆర్కు అమ్మవారి ఆశీస్సులు, కృప ఉండాలని కోరుకున్నట్లు కొణిజేటి ఆదినారాయణ తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించాలని దుర్గమ్మను కోరుకున్నట్లు తెలిపారు.
కాగా, హుజూర్నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. గత రికార్డులను బద్దలు చేస్తూ 43,284 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం 22 రౌండ్లలోనూ సైదిరెడ్డి ఆధిక్యం ప్రదర్శించారు. కాగా, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెండో స్థానానికి పరిమితమయ్యారు. మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి సపావత్ సుమార్ నిలిచాడు. ఇక బీజేపీ, టీడీపీలు నాలుగు, ఐదో స్థానాలకు పరిమితమయ్యాయి.
ఈ ఉపఎన్నికలో సైదిరెడ్డి రికార్డులు తిరగరాశారు. ఈ నియోజకవర్గంలో సైదిరెడ్డికి వచ్చిన మెజార్టీ ఇప్పటి వరకు ఏ అభ్యర్థికి రాకపోవడం గమనార్హం. ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన సైదిరెడ్డికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతోపాటు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించడంపై ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఆలోచనతో ఓట్లేశారని, ఎంతమంది ఎన్ని దుర్మార్గాలు చేసినా.. సంక్షేమానికి పట్టంకట్టారన్నారు. హుజూర్నగర్ ప్రజలందరికీ రుణపడి ఉంటామన్నారు.