నిండు అసెంబ్లీలో మంత్రి విడదల రజినిపై టీడీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలతో..!!
అమరావతి: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల రెండోరోజు రసవత్తరంగా సాగుతున్నాయి. తొలి రోజు సస్పెన్షన్కు గురైన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ ఇవ్వాళ సభకు హాజరయ్యారు. చర్చల్లో పాల్గొన్నారు. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ, రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 16 వైద్య కళాశాలలపై చర్చ వాడివేడిగా సాగింది. అధికార- ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. అయిదేళ్ల టీడీపీ హయాంలో చోటు చేసుకున్న తప్పులను మంత్రులు, వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రస్తావించారు. టీడీపీ దాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

డైనమిక్ లేడి మంత్రి సమాధానం ఇవ్వాలంటూ..
రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణంపై టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. నిర్మాణ పనులను వేగంగా సాగట్లేదని అన్నారు. అడ్మిషన్లు ఎప్పుడు ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. దీనికి డైనమిక్ లేడీ మంత్రి విడదల రజిని సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలు, లేవనెత్తిన అంశాలకు మంత్రి విడదల రజినీ సమాధానాలు ఇచ్చారు. అలాగే- కౌంటర్ అటాక్కూ దిగారు.

పొత్తు ఉన్నా..
2014 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ కేంద్రంలో బీజేపీ సారథ్యంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ- రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడూ కృషి చేయలేదని విమర్శించారు. బీజేపీతో పొత్తులో ఉన్న సమయంలో ఆ పార్టీకే చెందిన నాయకుడు కామినేని శ్రీనివాస్ స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారని విడదల రజిని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు ఉన్నా గానీ, ఆ పార్టీ నుంచి గెలుపొందిన కామినేని శ్రీనివాస్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా గానీ ఒక్క మెడికల్ కాలేజీని కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి మంజూరు చేయించుకోలేకపోయారని విమర్శించారు.

16 కళాశాలలకు..
కేంద్రం నుంచి పూర్తిస్థాయి సహాయ, సహకారాలు ఉన్నా గానీ చంద్రబాబు మెడికల్ కాలేజీల నిర్మాణంపై దృష్టి సారించలేదని ధ్వజమెత్తారు. ఈ పరిణామాలను రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టంగా విడదల రజినీ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అలాంటి పరిస్థితులు లేవని పేర్కొన్నారు. ఒకేసారి 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు.

వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు..
విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి కావచ్చిందని విడదల రజిని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ అయిదు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లను చేపట్టబోతోన్నామని అన్నారు. డిసెంబర్ నాటికి ఈ అయిదింటి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. 300లకు పైగా పడకల సామర్థ్యంతో ఉన్న జిల్లా ఆసుపత్రులకు అయిదు కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేశామని, అక్కడి వసతులను మరింత పెంచుతున్నామని అన్నారు.

జగన్ చొరవతోనే..
విజయనగరం, రాజమహేంద్రవరం వైద్య కళావాలలకు 35 కోట్లు, ఏలూరు, నంద్యాలలకు 38 కోట్ల రూపాయల చొప్పున నిధులను కేటాయించామని, లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో పీఈబీ స్ట్రక్చర్ నిర్మాణం చేపట్టామని ఈ నిధులను వినియోగిస్తోన్నామని విడదల రజిని సభకు వివరించారు. వైఎస్ జగన్ చూపిన చొరవతోనే రాష్ట్రవ్యాప్తంగా 16 వైద్య కళాశాలలు రూపుదిద్దుకుంటోన్నాయని ఆమె స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications