బుజ్జగింపులా.. బేరసారాలా?
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. బాదుడే బాదుడు.. ఇదే ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇదివరకు ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుడిగాలి పర్యటలను నిర్వహించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్గా చేసుకున్నారు.
త్వరలోనే ఉమ్మడి కృష్ణాజిల్లాలో.. ఈ కార్యక్రమాలను చేపట్టనుంది తెలుగుదేశం పార్టీ. ప్రత్యేకించి విజయవాడ పరిధిలోని అన్ని నియోజకవర్గాలతో పాటు గుడివాడ, గన్నవరం, పెడన, మైలవరం, జగ్గయ్యపేట, నందిగా, మచిలీపట్నం.. వంటి నియోజకవర్గాల్లో చంద్రబాబు బహిరంగ సభలు, రోడ్ షో నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తోన్నారు టీడీపీ నాయకులు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోన్నారు.
మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, కొల్లు రవీంద్ర, గద్దె రామ్మోహన్, బోండా ఉమా మహేశ్వరరావు, బుద్ధా వెంకన్న వంటి సీనియర్ నాయకులు దీన్ని సమన్వయం చేసుకోనున్నారు. విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నానితోనూ సంప్రదంపులు చేస్తోన్నప్పటికీ.. ఆయన అంగీకరిస్తారా? లేదా? అనేది తెలియ రావాల్సి ఉంది. ఆయనను ఒప్పించే బాధ్యతలను పార్టీ నాయకులు తీసుకున్నారు.
ఇదే క్రమంలో- వంగవీటి రాధాకృష్ణతో సంప్రదింపులు మొదలయ్యాయి. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ఆందోళనలో వంగవీటి రాధాకృష్ణకు కీలక బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో- వంగవీటితో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భేటీ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీని పునరుత్తేజితం చేసేలా చంద్రబాబు చేపట్టబోయే ఆందోళన కార్యక్రమం ఉంటుందని, దీన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు.
స్థానికంగా ప్రజా సమస్యలపై పోరాడేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని కొల్లు రవీంద్ర సూచించినట్లు చెబుతున్నరు. వంగవీటి రాధాకృష్ణ- మున్ముందు జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ ఇదివరకే వార్తలు వచ్చిన నేపథ్యంలో కొల్లు రవీంద్ర ఆయనను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2024 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దాదాపు ఖాయమౌతుందనే భరోసాను వంగవీటికి ఇచ్చినట్లు చెబుతున్నారు.