వల్లభనేని వంశీ అసంతృప్తి..! నిర్ణయం మారిందా..!!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి రాజకీయంగా చర్చకు కారణమవుతున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీకి దగ్గరైన వంశీ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచే పోటీకి సిద్దమవుతున్నారు. ఇప్పటి వరకు గన్నవరం వైసీపీ నేతల నుంచి సరైన సహకారం లేకపోయినా, ముందుకు సాగుతున్నారు. కానీ, కొద్ది రోజులుగా వంశీ రాజకీయంలో మార్పు కనిపిస్తోంది. అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఇది ఇప్పుడు వైసీపీలోనే కాదు టీడీపీలోనూ బిగ్ డిబేట్ గా మారుతోంది.
మారుతున్న వంశీ రాజకీయం
2019 ఎన్నికల్లో జగన్ సునామీలోనూ గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా వంశీ గెలుపొందారు. గెలిచిన కొద్ది రోజులకే తన మిత్రుడు కొడాలి నాని ప్రోత్సాహంతో వైసీపీకి దగ్గరయ్యారు. అధికారికంగా పార్టీ మారలేదు కానీ, అసెంబ్లీలోనూ తనను స్వతంత్ర సభ్యుడిగా గుర్తించాలని కోరారు. సందర్భం వచ్చిన ప్రతీ సారి టీడీపీ అధినేత చంద్రబాబు -లోకేష్ టార్గెట్ గా విరుచుకుపడే వారు. కొడాలి నాని మంత్రిగా ఉన్న కాలంలో వంశీ కి దాదాపు అదే ప్రాధాన్యత దక్కింది. కొంత కాలంగా వంశీ తీరులో మార్పు కనిపిస్తోందని గన్నవరం వైసీపీలో చర్చ మొదలైంది. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకటరావు.. రామచంద్రరావు వర్గాల నుంచి వంశీకి వ్యతిరేకత ఉంది. కానీ, వైసీపీ అధినాయకత్వం - జిల్లా వైసీపీ సమన్వయకర్తలు మాత్రం వచ్చే ఎన్నికల్లో వంశీ పోటీ చేస్తారని ఇప్పటికే తేల్చి చెప్పారు.
వంశీ మౌనం వెనుక అసలు కారణం
ఇది వైసీపీలోని ఆ ఇద్దరు నేతలకు రుచించటం లేదు. ఇదే సమయంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం జరిగింది. ఎన్టీఆర్ పేరు మార్చకుండా పునరాలోచన చేయాలని వంశీ ఆ సమయంలోనే సీఎం జగన్ ను కోరారు. కానీ, అసెంబ్లీ పేరు మార్పుకు ఆమోదించారు. వల్లభనేని వంశీ రాజకీయంగా ఎక్కడ ఉన్నా ఎన్టీఆర్ కు వీర భక్తుడు. జూనియర్ ఎన్టీఆర్ తోనూ కొద్ది రోజుల క్రితం వరకు సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఈ నిర్ణయం పైన వల్లభనేని వంశీ ఆ తరువాత మాట్లాడ లేదు. ఎన్టీఆర్ పేరు వైసీపీ ప్రభుత్వం మార్చటం తమకు రాజకీయంగా నష్టం చేస్తుందనేది వంశీ మనోగతంగా తెలుస్తోంది. నియోజవకర్గంలో వైసీపీకి దగ్గరైన సమయం నుంచి అదే పార్టీ నేతల నుంచి సమస్యలు ఎదురైనా..వంశీ ముందుకే అడుగు వేసారు. ఇక, అమారావతి రైతుల మహా పాదయాత్ర సమయంలో వైసీపీ నేతలు ఆ యాత్ర పైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఈ యాత్రను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.
వంశీ రాజకీయ అడుగులపై ఆసక్తి
నిత్యం వైసీపికి మద్దతుగా..చంద్రబాబు నిర్ణయాల పైన విరుచుకుపడే వల్లభనేని వంశీ..ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో రాజకీయ వివాదంగా మారుతున్న అమరావతి పాదయాత్ర పైన స్పందించ లేదు. నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే వల్లభనేని వంశీ..కొంత కాలంగా ఆ స్థాయిలో యాక్టివ్ గా లేరని వైసీపీలోచే చర్చ సాగుతోంది. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలను వైసీపీ అధినాయకత్వం కంట్రోల్ చేయటం లేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్లుగా చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం క్రిష్ణా జిల్లా టీడీపీ నేతలు.. కొడాలి నాని లక్ష్యంగా సవాళ్లు చేసినా.. వల్లభనేని వంశీ స్పందించలేదని చెబుతున్నారు. గుడివాడ లో అమరావతి రైతులు కొడాలి నానికి సవాల్ చేసారు. ఆ అంశంలోనూ వంశీ మౌనంగానే ఉన్నారు. అయితే, వంశీ అసంతృప్తికి అసలు కారణాలు ఏంటనేది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన నేతల నియోజకవర్గాల పైన వైసీపీ అధినాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ సమయంలో..ఇప్పుడు వంశీ వ్యవహారం వైసీపీలో ఆసక్తి కరంగా మారుతోంది.