ఏపీలో నర్సింగ్ విద్యార్థులు ఉపకార వేతనాలు భారీగా పెంపు: రెట్టింపు చేస్తూ ఉత్తర్వులు
అమరావతి: రాష్ట్రంలో నర్సింగ్ విద్యార్థుల ఉపకార వేతనాలు భారీగా పెరిగాయి. ఇప్పటిదాకా వారికి అందుతోన్న ఉపకార వేతనాలను రెట్టింపు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో శిక్షణ పొందే విద్యార్థులకు మాత్రమే ఈ పెంపుదల వర్తిస్తుందని వెల్లడించారు.
నర్సింగ్ విద్యార్థుల శిక్షణా కాలం మూడేళ్ల పాటు ఉంటుంది. నాలుగో సంవత్సరంలో వారికి ఇంటర్న్ షిప్ కల్పిస్తారు. ఇంటర్న్ షిప్ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని వారికి ఉపకార వేతనాలను చెల్లిస్తూ వస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. శిక్షణలో చేరిన తొలి ఏడాదిలో 1500, రెండో ఏడాది-1700, మూడో ఏడాది-1900, ఇంటర్న్ షిప్-2,200 రూపాయలు ఉపకార వేతనాల రూపంలో నర్సింగ్ విద్యార్థులకు అందుతున్నాయి.
తాజాగా- వైఎస్ జగన్ సర్కార్ దీన్ని సవరించింది. రెట్టింపు చేసింది. తొలి ఏడాదిలో 3,000, రెండో ఏడాది-3,500, మూడో ఏడాది-4,000, ఇంటర్న్ షిప్ కాలానికి-4,500 రూపాయల మేర పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఉపకార వేతనాలను చివరిసారిగా 2010లో సవరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కే రోశయ్య ప్రభుత్వం నర్సింగ్ విద్యార్థుల ఉపకార వేతనాలను స్వల్పంగా పెంచింది.
Rapaka Varaprasad: జగన్ నిర్ణయం భేష్: ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయాం: వికేంద్రీకరణ అత్యవసరం: రాపాక
అప్పటి నుంచీ తమకు చెల్లిస్తోన్న ఉపకార వేతనాలను పెంచాలంటూ భారత శిక్షణ పొందిన నర్సుల అసోసియేషన్ సహా ఏపీ ప్రభుత్వ నర్సుల అసోసియేషన్ అడ్ హక్ కమిటీ సభ్యుల సంఘం ప్రతినిధులు తరచూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉపకార వేతనాల మొత్తాన్ని రెట్టింపు చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పట్ల నర్సింగ్ విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వారు కృతజ్ఞతలను తెలియజేస్తున్నారు.