కొడాలి నానిపై టీడీపీ అభ్యర్ధి ఫిక్స్ - గుడివాడలో చంద్రబాబు కొత్త లెక్కలు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు హిట్ లిస్టులో తొలి స్థానంలో ఉంది మాజీ మంత్రి కొడాలి నాని. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావటం ఎంత ముఖ్యమో...గుడివాడలో గెలుపు ఒక విధంగా అంతకంటే టీడీపీ ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న కొడాలి నాని పార్టీ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు - లోకేష్ లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలనేది ఇప్పుడు చంద్రబాబు - లోకేష్ లక్ష్యంగా మారింది.
కొడాలి నాని పై చంద్రబాబు ఫోకస్
అందులో భాగంగా.. కొద్ది నెలల క్రితం జిల్లా మహానాడు ద్వారా గుడివాడలో సమరశంఖం పూరించేందుకు సిద్దమయ్యారు. కానీ, సభ జరగలేదు. టీడీపీ అధినేత ఇప్పుడు ప్రధాన నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధులను ఒక్కొక్కటిగా ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు గుడివాడ లో కొడాలి నాని పైన పోటీకి తమ పార్టీ అభ్యర్ధిని ఫిక్స్ చేసారు. గుడివాడ నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి దేవినేని ఉమా పోటీ చేయటం ఖరారైంది. ఈ మేరకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఉమ్మడి క్రిష్ణా జిల్లా టీడీపీ నేతల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా తొడ కొట్టి గుడివాడ నుంచి కొడాలి నానిని ఓడిస్తామంటూ శపథం చేసారు. ఆ సమయంలో పార్టీ కేడర్ నుంచి అనూహ్య స్పందన వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ తరువాత గుడివాడ నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు సైతం దేవినేని ఉమా ను పార్టీ అభ్యర్ధిగా ప్రకటించాలంటూ ముఖ్య నేతల వద్ద కోరినట్లు తెలుస్తోంది.
టీడీపీ అభ్యర్ధిగా దేవినేని ఉమా..!
దీని పైన పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతోనూ సంప్రదింపులు చేసారు. ఇప్పుడే గుడివాడ అభ్యర్ధిని ప్రకటిస్తే అక్కడి సమస్యలను పరిష్కరించుకంటూ..ఎన్నికల నాటికి బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. అయితే, తాము టార్గెట్ చేసిన కీలక నియోజకవర్గం..అందునా పొత్తుల అంశం పైన అధికారికంగా క్లారిటీ వచ్చే వరకూ వేచి చూడాలనే అభిప్రాయం కొందరు నేతలు పార్టీ అధ్యక్షుడి వద్ద వెలుబుచ్చారు. జనసేన కూడా గుడివాడలో ఈ సారి పట్టుదలతో కనిపిస్తోందని, కొడాలి నాని లక్ష్యంగా అడుగులు వేస్తున్న అంశం చర్చకు వచ్చింది. పొత్తు ఖరారైనా..టీడీపీ నుంచే గుడివాడ లో అభ్యర్ధి బరిలో దింపాలని టీడీపీ డిసైడ్ అయింది. అందులో భాగంగా మాజీ మంత్రి దేవినేని ఉమా పేరు దాదాపు ఫైనల్ అయింది. అధికారికంగా ప్రకటించటమే మిగిలింది. గుడివాడ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి నాని రెండు సార్లు టీడీపీ నుంచి..రెండు సార్లు వైసీపీ నుంచి గెలుపొందారు.
కొడాలి నాని ప్రతిష్ఠకు సవాల్ గా
నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న నేతగా ఉన్నారు. 2019 ఎన్నికల్లోనూ కొడాలి నాని కి ప్రత్యర్ధిగా దేవినేని అనినాశ్ పోటీ చేసారు. అయినా, కొడాలి నాని గెలుపొందారు. ఇక, దేవినేని ఉమా 2004లో నందిగామ నుంచి టీడీపీ టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో ఈ నియోజకవర్గంలో రిజర్వ్ కావటంతో మైలవరం కు ఉమా మారారు. 2009,2014 ఎన్నికల్లో మైలవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో చంద్రబాబు కేబినెట్ లో ఇరిగేషన్ మంత్రిగా పని చేసారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి వసంత క్రిష్ణప్రసాద్ చేతిలో ఓడిపోయారు. అదే సమయంలో దేవినేని ఉమాకు టికెట్ ఇస్తే, గుడివాడ టీడీపీ శ్రేణుల స్పందన ఏంటనే అంశం పైన ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.
కొడాలి నాని వర్సస్ ఉమా..గెలుపెవరిది
ఇప్పటికే అమరాతి రైతుల మహా పాదయాత్ర గుడివాడలో ప్రవేశించిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు.. టీడీపీ నేతల వార్నింగ్ లతో కొడాలి నాని ఏ స్థాయిలో టార్గెట్ అయ్యారో స్పష్టం అవుతోంది. కొడాలి నాని సైతం ఇప్పటికే టీడీపీ తనను నియోజకవర్గం లో ఓడించాలనే ఆలోచనలతో రైతుల పాదయాత్రతో సహా అనేక ప్రయత్నాలు మొదలు పెట్టిందని చెప్పుకొచ్చారు. కొడాలి నాని మంత్రిగా ఉన్న సమయంలో.. నాని వర్సస్ దేవినేని ఉమా అన్నట్లుగా సవాళ్లు - ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఇద్దరి మధ్య ఆరోపణలు క్రిష్ణా జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టించాయి. ఇక, ఇప్పుడు కొడాలి నాని పైన టీడీపీ అభ్యర్ధిగా దేవినేని ఉమాను బరిలోకి దించాలనే నిర్ణయంతో ఫలితం ఏ రకంగా ఉంటుందనే ఉత్కంఠ రాజకీయంగా రెండు పార్టీల్లోనూ కనిపిస్తోంది.