నువ్వు ఎన్టీఆర్ మనవడివే అయితే.. అమరావతి రైతుల ఛాలెంజ్: జూనియర్ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్
తిరుపతి: అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మూడు రాజధానులకు అనుకూలంగా ఆయా ప్రాంతాల ప్రజలు రోడ్డెక్కడం.. బైక్ ర్యాలీలను నిర్వహిస్తోన్న నేపథ్యంలో- సరికొత్త వివాదాలు చుట్టుముట్టాయి. మొన్నటివరకు ఈ వ్యవహారం పట్ల అంటీముట్టనట్టుగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి పాదయాత్రగా తరలి వెళ్తోన్న అమరావతి ప్రాంత రైతులు.. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆయనపై ఘాటు విమర్శలు చేశారు. వ్యక్తిగత దాడికీ దిగారు. జూనియర్ ఎన్టీఆర్పై సవాళ్లు విసిరారు. తాను ఎన్టీఆర్ మనవడినని జూనియన్ చెప్పుకొంటోన్నాడని, ఆ అర్హత లేదని ఆరోపించారు. ఎన్టీ రామారావు మనవడిగా చెప్పుకోవద్దంటూ హెచ్చరించారు. జూనియర్ నిజంగా ఎన్టీఆర్ మనవడే అయితే- స్పందించాలని డిమాండ్ చేశారు.
తాతను అవమానించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నాడని నిలదీశారు. నువ్వు ఉంటే ఎంత.. లేకుంటే ఎంత.. అంటూ తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీని తామే లాక్కొస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చంద్రబాబు నాయుడే వెనక ఉండి అమరావతి ప్రాంత రైతులతో జూనియర్ ఎన్టీఆర్ను తిట్టిస్తోన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు.
అమరావతి పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ని తిడుతున్న రైతులు. pic.twitter.com/okWvEUmDMt
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) October 9, 2022
ఈ వ్యవహారం పట్ల ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్పందించింది. రైతుల తీరును తప్పుపట్టారు. ఏ మాత్రం సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్ను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఇదివరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు సమయంలో కూడా జూనియర్పై తెలుగుదేశం పార్టీ నాయకులు ట్రోల్స్ చేశారని, ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే తీసుకొచ్చారని మండిపడ్డారు.
ఈ మేరకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కావూరి కృష్ణ, కన్వీనర్ నున్న గణేష్ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు. జూనియర్ ఎన్టీఆర్ను బూతులు తిడుతూ అసభ్యకరంగా మాట్లాడటం సరికాదని అన్నారు. జూనియర్ను తిట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు తెలుగుదేశం పార్టీకి విజ్ఞప్తి చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా తన నటన ద్వారా ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంటోన్న జూనియర్ను రాజకీయాలకు వాడుకోవడం తప్పు అని తేల్చి చెప్పారు.
అమరావతి ప్రాంత రైతులు జూనియర్కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే పాదయాత్రను తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. జూనియర్పై చేసిన విమర్శలకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని స్పష్టం చేశారు.