గన్నవరం ఉప ఎన్నికపై ఏపీలో ఆసక్తికర చర్చ .. పవన్, లోకేష్ ...హేమాహేమీలపై బిగ్ డిబేట్
వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి,టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో గన్నవరం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. పదవికి రాజీనామా అధికారికంగా అందిస్తే స్పీకర్ ఆమోదిస్తే ఆరు నెలల్లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. మరోపక్క నవంబర్ 3 వ తేదీన వంశీ వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయం అని ప్రచారం జరుగుతుంది . ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే వైసీపీలో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి కచ్చితంగా రాజీనామా చెయ్యాల్సిన పరిస్థితి. దీంతో ఉప ఎన్నికలు వస్తే గన్నవరం నియోజకవర్గం నుండి ఎవరు బరిలోకి దిగుతారు ? గన్నవరం రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? అన్న చర్చ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
వంశీని వదులుకోలేం.. మరో పక్క టీడీపీ ప్లాన్ బీ ఏంటో తెలుసా?
గన్నవరం ఉప ఎన్నికపై అప్పుడే ఆసక్తికర చర్చ
గన్నవరం ఉప ఎన్నిక అనివార్యమైతే టిడిపి నుండి ఎవరు పోటీ చేస్తారు ? వైసిపి నుండి ఎవరు రంగంలో ఉండబోతున్నారు? జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గంలో తల పడుతుందా? అయితే ఎవరు జనసేన నుండి బరిలోకి దిగుతారు అన్న అంశాలపై అటు రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో టిడిపి నుండి, జనసేన పార్టీ నుండి హేమాహేమీలైన నేతలు ఓటమి పాలయ్యారు.
జనసేన నుండి ఓటమిపాలైన పవన్, టీడీపీ నుండి ఓడిన లోకేష్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుండి, గాజువాక నుండి పోటీ చేసి రెండు చోట్ల ఓటమిని చవి చూశారు. ఇక టిడిపి నుండి మొదటి సారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగి మంగళగిరి నియోజకవర్గంలో హోరాహోరీగా తలపడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ఓటమిపాలయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే గన్నవరం నియోజకవర్గం నుండి ఎవరు పోటీ పడతారు. ఒకవేళ టిడిపి నుండి లోకేష్, జనసేన నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.
రాజకీయ భవితవ్యం కోసం లోకేష్ , పవన్ లు బరిలోకి దిగుతారా.. అని చర్చ
టిడిపిలో ప్రస్తుతం నారా లోకేష్ రాజకీయ భవితవ్యం ఎమ్మెల్సీ పదవి కాలపరిమితి తీరితే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల ఓటమితో కనీస అసెంబ్లీలో కాలు పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. వీరిద్దరూ తమ రాజకీయ భవిష్యత్ కోసం పోటీ చేసే అవకాశం లేకపోలేదు అన్నది ప్రధానంగా జరుగుతున్న చర్చ. అయితే తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇసుక కోసం పోరాటం సాగిస్తూ రెండు పార్టీలు కలిసి లాంగ్ మార్చ్ నిర్వహించబోతున్నాయి. ఒకవేళ మళ్లీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడిస్తే ఎవరు పోటీ చేస్తారనేది మరో ఆసక్తికర చర్చ .
టీడీపీ నుండి పోటీకి గత ఎన్నికల్లో ఓడిపోయిన కీలకనేతల ఆసక్తి
ఇక టీడీపీ తరుపున లోకేష్ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక లోకేష్ కాకుంటే గత ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి దేవినేని ఉమా కానీ గద్దె రామ్మోహన్ భార్య అనురాధ కానీ , తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ కానీ పోటీ చేసే అవకాశాలున్నాయని చర్చించుకుంటున్నారు. సిట్టింగ్ స్థానం చేజారకుండా కాపాడటానికి చంద్రబాబు ఎవరిని రంగంలోకి దించుతారో అన్నది ఆసక్తికరంగా మారింది.
వైసీపీ నుండి వంశీనా ? యార్లగడ్డ నా
అటు వైసీపీ తరుపున ఎక్కువ శాతం వంశీ పోటీ చేసే అవకాశం ఉందనే భావన ఉన్నా, వంశీకి రాజ్యసభ సభ్యునిగా ఛాన్స్ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది.ఒకవేళ వంశీ పోటీ చేస్తే వైసీపీ ఇన్ చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు భవిష్యత్ ఏంటో అర్ధం కానీ పరిస్థితి. వంశీ పోటీ చేయకుంటే మాత్రం యార్లగడ్డ వెంకట్రావుకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. వంశీ వైసీపీలో చేరి గన్నవరం నియోజకవర్గం నుండి పోటీ చేస్తే అసంతృప్తితో ఉన్న వెంకట్రావును టీడీపీలోకి ఆహ్వానించాలని కూడా చంద్రబాబు ఆలోచిస్తారని టాక్ వినిపిస్తుంది.
రాజకీయ వర్గాల్లోనూ , ప్రజల్లోనూ కొత్త లెక్కలు
మొత్తానికి వంశీ రాజీనామాతో గన్నవరం నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైతే తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గన్నవరం నియోజకవర్గంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ టీడీపీ జండా ఎగురుతూనే ఉంది. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో చరిష్మా ఉన్న వల్లభనేని వంశీ పార్టీ మారితే, ఉప ఎన్నిక జరిగితే ఫలితం ఎలా ఉంటుంది అన్న దానిపై రాజకీయ వర్గాలు, సామాన్య ప్రజలు కొత్త కొత్త సమీకరణాలను చెబుతున్నారు.