వైసీపీ నేతలు ఆంబోతులు .. జగన్ ఫ్యామిలీ రాజధానిలో పాదయాత్ర చేయగలరా ? దేవినేని ఉమా ఫైర్
ఏపీలో రాజధానిపై కొనసాగుతున్న రగడ ఇంకా ఉధృతంగానే కొనసాగుతుంది. రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు ఆగటం లేదు. ఇక రైతుల పోరాటానికి మద్దతుగా టీడీపీ పోరాటం సాగిస్తుంది .అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇటీవల 24 గంటల దీక్ష చేశారు. వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు.

జగన్, కుటుంబ సభ్యులు రాజధానిలో పాదయాత్ర చేయగలరా అని ప్రశ్న
రాజధానిపై ఆందోళన చేపట్టిన రైతులకు మద్దతు తెలుపుతూ దేవినేని వైసీపీ సర్కార్ పై విరుచుకుపడుతూనే ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలురాజధాని అమరావతి విషయంలో నోటికి వచ్చినట్టు ఆంబోతుల్లా మాట్లాడుతున్నారని టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత కుటుంబంతో కలిసి రాజధానిలో పర్యటిస్తే విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు దేవినేని ఉమా . ఇక జగన్, కుటుంబ సభ్యులు రాజధానిలో పాదయాత్ర చేయగలరా? అని ప్రశ్నించారు.

ఇన్సైడర్ ట్రేడింగ్ కోసమే విశాఖ రాజధాని అని ఆరోపణలు
విశాఖను రాజధాని చేయాలని ఎవరూ అడగలేదని పేర్కొన్న ఆయన అమరావతిని అందరి ఆమోదంతోనే నిర్ణయించారని అప్పుడు కూడా వైసీపీ ఉందికదా అని ప్రశ్నించారు. అమరావతిని మార్చాల్సిన అవసరం ఏం వచ్చింది? అంటూ నిలదీశారు .ఉద్యమం చేసేవారిని పెయిడ్ ఆర్టిస్టులు అనడానికి సిగ్గులేదా? అని మండిపడ్డారు. విశాఖలో వేలాది ఎకరాలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. కేవలం ఇన్సైడర్ ట్రేడింగ్ కోసమే విశాఖను రాజధాని చేస్తున్నారని ఆరోపించారు.

విశాఖ భూదందాలపై సీబీఐ విచారణ జరపాలని సవాల్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భూదందాలకు పాల్పడుతున్నారని, సీఎం జగన్కి ధైర్యం ఉంటే విశాఖ భూదందాలపై సీబీఐ విచారణ జరపాలని దేవినేని ఉమా సవాల్ చేశారు. విశాఖ భూదందాలో ముఖ్యమంత్రికి సహకరించిన అధికారులు జైలుకెళ్లక తప్పదని హెచ్చరించారు. వైసీపీ నేతలు ఏసీబీని అడ్డుపెట్టుకుని ఉద్యోగ సంఘాల నేతల్ని బెదిరిస్తున్నారని దేవినేని ఉమా ఆరోపణలు గుప్పించారు. రాజధాని అమరావతి విషయంలో జగన్ కు ప్రజలు తగిన గుణపాఠం తప్పక చెప్తారని దేవినేని హెచ్చరించారు .












Click it and Unblock the Notifications