జగన్ వి తుగ్లక్ నిర్ణయాలు ..వైజాగ్ లో అందుకే క్యాబినెట్ భేటీ .. దేవినేని ఉమా
ఏపీ సీఎం మూడు రాజధానుల ప్రకటనతో ఏపీలో మొదలైన రగడ ఇంకా కొనసాగుతుంది. ఇక తాజాగా రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకోటానికి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని భావిస్తున్న జగన్ ఈ నెల 27 వ తేదీన విశాఖ వేదికగా మంత్రివర్గ భేటీ నిర్వహిస్తున్నారు. అయితే వైజాగ్ వేదికగా క్యాబినెట్ భేటీ పెట్టటంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శలు గుప్పించారు.
చంద్రబాబుది మోసం చేసే నైజం అని పార్ధసారధి ముందే చెప్పారు .. దేవినేని అవినాష్ తీవ్ర వ్యాఖ్యలు
జగన్ వైజాగ్ లో క్యాబినెట్ భేటీ పెడుతుంది భయంతోనే అన్న దేవినేని ఉమా
అమరావతిలో మంత్రివర్గ భేటీ పెట్టే దమ్ము లేక వైజాగ్ లో క్యాబినెట్ భేటీ పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయోమయంలో పెట్టారని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.700 ఏళ్ల క్రితం ఈ దేశం తుగ్గక్ పరిపాలనను చూసింది. అయితే ఇప్పుడు జగన్ పాలనలో తుగ్లక్ ను మించిన పరిపాలనను చూస్తున్నారని అన్నారు . ఆయన పిచ్చి తుగ్లక్ లా వ్యవహరిస్తున్నారు అని దేవినేని ఉమా మండిపడ్డారు .
పక్కా ప్లాన్ తోనే రాజధాని తరలిస్తున్న వైసీపీ
జీఎన్ రావు కమిటీ రిపోర్టులు బయటపెట్టకుండా 27 న క్యాబినెట్ భేటీ పెడుతున్నారని, జగన్ తాను అనుకున్నది చేసే పనిలో ఉన్నారని, జీఎన్ రావు కమిటీ నివేదికలను ఆమోదించే ఎత్తుగడలో ఉన్నారని పేర్కొన్నారు దేవినేని ఉమా. 28వ తారీఖున సెక్రటేరియట్ భవనాలను శంకుస్థాపన చేయనున్నారు అని దేవినేని ఉమ అన్నారు. అంతా కుత్రపూరితంగానీ పక్కా ప్లాన్ తో రాజధానిని తరలిస్తున్నారని దేవినేని ఉమా పేర్కొన్నారు.
అమరావతి రైతులపై జగన్ చిన్నచూపు .. తుగ్లక్ లా జగన్
అమరావతి రైతులు త్యాగాలు చేసి భూములుఇచ్చారని పేర్కొన్న దేవినేని ఉమా మాస్టర్ ప్లాన్ ప్రకారం వారికి ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వాలి కానీ రాజధాని లేకుండా డెవలప్మెంట్ ఎలా అవుతుంది అని ఆయన విమర్శించారు. ఇవన్నీ పక్కకు పెట్టి తన ఆస్తులు కాపాడుకోవడానికి, కక్షతో జగన్ పార్టీ వ్యవహరిస్తోంది. మేనిఫెస్టోలో రాజధాని మారుస్తున్నట్లు చెప్పావా? హైకోర్టును మారుస్తామని చెప్పావా? జగన్ పిచ్చి తుగ్లక్ లా ప్రవర్తిస్తున్నాడు అని ఆయన ఎద్దేవా చేశారు .
వైజాగ్ లో భారీగా ఆస్తులు కొనుగోలు చేశాకే ఈ నిర్ణయం అన్న దేవినేని ఉమా
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చి ఇక్కడ హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పుడా హైకోర్టును మార్చాలని చూస్తున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి మూడు నెలలుగా పెద్ద ఎత్తున విశాఖలో ఆస్తులను కొనుగోలు చేశారు . ఇక ఇష్టారాజ్యంగా సాగుతున్న ఈ తుగ్లక్ జగన్ పరిపాలన చూసి పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. వైజాగ్ లో రాజధాని రైతుల నిరసనలకు భయపడే క్యాబినెట్ భేటీ పెడుతున్నారని పేర్కొన్నారు.